MG Motors: ఎంజీ మోటార్స్ కస్టమర్లకు షాక్.. జనవరి 1 నుంచి కార్ల ధరలు పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
రానున్న కొత్త సంవత్సరంలో ఎంజీ మోటార్స్ (MG Motors) తన కస్టమర్లకు ధరల పరంగా షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. జనవరి 1, 2026 నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్త ఏడాది నుంచి వాహనాల ధరలను గరిష్ఠంగా రెండు శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఈ ధరల పెరుగుదల అన్ని మోడళ్లకు, అన్ని వేరియంట్లకు ఒకేలా ఉండదని, వాహనాన్ని బట్టి మారుతుందని స్పష్టం చేసింది. ఇటీవల విడుదల చేసిన కొత్త MG హెక్టర్ SUV ధరను మాత్రం ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగిస్తామని కంపెనీ పేర్కొంది. అయితే హెక్టర్ డీజిల్ వేరియంట్ల ధరలను ఇంకా ప్రకటించలేదు.
Details
కొత్త ధరల పెంపునకు నిర్ణయం
ముడి పదార్థాల ఖర్చులు పెరగడం, ఇతర ఆర్థిక కారణాల ప్రభావంతోనే కొత్త సంవత్సరం నుంచి ధరల సవరణకు నిర్ణయం తీసుకున్నట్లు ఎంజీ మోటార్స్ వెల్లడించింది. భారత మార్కెట్లో ఎంజీ మోటార్స్ ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వాహనాల నుంచి EV(ఎలక్ట్రిక్ వాహనాలు) వరకు విస్తృత శ్రేణి కార్లను విక్రయిస్తోంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో MGకామెట్ EV, ZS EV, విండ్సర్ EVతో పాటు హెక్టర్, గ్లోస్టర్ వంటి పాపులర్ SUVలు ఉన్నాయి. ధరలు పెరగనున్న నేపథ్యంలో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారు డిసెంబర్ నెల ముగిసేలోపు తమ ప్లాన్ను అమలు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో, మరికొన్ని ఆటోమొబైల్ కంపెనీలు కూడా త్వరలో ధరలు పెంచే అవకాశముందని సమాచారం అందుతోంది.