
Bullet Train: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్లో కీలక ముందడుగు.. రూ.4,100 కోట్లతో సిగ్నలింగ్,టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో తొలిసారిగా పరుగెత్తబోతున్న బుల్లెట్ రైలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.
అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మాణంలో ఉన్న హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్లో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ప్రాజెక్ట్కు అవసరమైన అత్యాధునిక సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటు కోసం కాంట్రాక్ట్ను నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) సీమెన్స్ కన్సార్టియంకు అప్పగించింది.
ఈ కన్సార్టియంలో దినేష్ చంద్ర ఆర్. అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, సీమెన్స్ లిమిటెడ్, సీమెన్స్ మొబిలిటీ జీఎంబీహెచ్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
ఈ మూడు సంస్థల కూటమి కలిసి, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గంలో ఆధునిక సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను అమలు చేయనుంది.
వివరాలు
సీమెన్స్ లిమిటెడ్ వాటా కాంట్రాక్ట్ విలువ రూ.1,230 కోట్లు
ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు రూ.4,100 కోట్లుగా ఉండగా,అందులో సీమెన్స్ లిమిటెడ్కు చెందిన వాటా సుమారుగా రూ.1,230 కోట్లు.
ఈ కాంట్రాక్ట్ కింద సిగ్నలింగ్ వ్యవస్థలు,టెలికమ్యూనికేషన్ టెక్నాలజీలు డిజైన్ చేయడం,వాటిని అమలు చేయడం,అలాగే 15 సంవత్సరాల పాటు వాటి నిర్వహణ బాధ్యతను కూడా సీమెన్స్ స్వీకరించింది.
ఈ ప్రాజెక్ట్లో సీమెన్స్ సంస్థ యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ETCS) లెవెల్ 2 ఆధారిత సిగ్నలింగ్, ట్రైన్ కంట్రోల్ వ్యవస్థలను అమలు చేయనుంది.
ఈ ఆధునిక టెక్నాలజీతో రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడవగలవు.
అంతేగాక,ఇది రియల్టైమ్ మానిటరింగ్ సౌలభ్యం కల్పించడంతో పాటు,నిరవధిక వైర్లెస్ కనెక్టివిటీని కూడా అందిస్తుంది.
అలాగే,కేంద్రీకృతంగా ట్రాఫిక్ను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగివుంది.
వివరాలు
15 సంవత్సరాలపాటు సీమెన్స్ నిర్వహణ సేవలు
ప్రపంచవ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో ఈ ETCS లెవెల్ 2 టెక్నాలజీ విజయవంతంగా అమలవుతుండటం గమనార్హం.
ఈ ప్రాజెక్ట్ను 54 నెలల్లో పూర్తి చేయనున్నట్టు, 15 సంవత్సరాలపాటు సీమెన్స్ నిర్వహణ సేవల్ని అందించనున్నట్టు సంస్థ వెల్లడించింది.
దీని వలన వ్యవస్థ దీర్ఘకాలికంగా నమ్మకంగా పనిచేస్తుందని హామీ ఇచ్చింది.
ఇంత ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్లో NHSRCLతో భాగస్వామ్యం కావడం గర్వకారణమని సీమెన్స్ స్పష్టం చేసింది.
'మేక్ ఇన్ ఇండియా' భావనకు తమ కంపెనీ కట్టుబడి ఉందని పేర్కొంది.
ఈ ప్రాజెక్ట్ దేశంలోని హై స్పీడ్ రైల్వే వ్యవస్థ అభివృద్ధికి ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని సీమెన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, CEO సునీల్ మాథుర్ వ్యాఖ్యానించారు.