Page Loader
Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత
సీతారాం ఏచూరి కన్నుమూత

Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
ద్వారా సవరించబడింది Sirish Praharaju
Sep 12, 2024
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) మృతిచెందారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కారణంగా, దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆయన ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్టుగా పేరుగాంచిన ఏచూరి, 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరోలో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు.

వివరాలు 

హైదరాబాద్‌లో బాల్యం

సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాస్‌లో (ప్రస్తుతం చెన్నై) తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో ఇంజినీర్ కాగా,తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు.సీతారాం బాల్యం హైదరాబాద్‌లో గడిచింది. అక్కడ ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. తరువాత,దిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు.1970లో సీబీఎస్‌సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తి చేసి, జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు.

వివరాలు 

రాజకీయ ప్రస్థానం

అక్కడే పీహెచ్‌డీ చేయాలని భావించినా,ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో ఆ చదువు ఆగిపోయింది. ఆయన మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ కాగా,రెండో వివాహం జర్నలిస్టు సీమా చిశ్తీతో జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1974లో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సీతారాం, 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉండగా సీపీఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో ఆయన అరెస్టు అయ్యారు. మూడు సార్లు జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికై, వామపక్ష నేతగా జేఎన్‌యూను ప్రభావితం చేశారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరిన సీతారాం, 1992లో పొలిట్‌బ్యూరోలో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో మొదటిసారిగా పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికై, 2015లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

వివరాలు 

ప్రజా సమస్యలపై తన గళం

సీతారాం ఏచూరి ప్రజాసమస్యలపై గళమెత్తి, ఎగువ సభలో ప్రముఖుడయ్యారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి 'కామన్ మినిమమ్ ప్రోగ్రామ్' ముసాయిదా రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2004లో యూపీఏ ప్రభుత్వ నిర్మాణంలోనూ మేజర్ రోల్ పోషించారు. రచయితగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్' పేరిట ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాయడంతో పాటు, 'క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే', 'సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్', 'మోదీ గవర్నమెంట్: న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం', 'కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం' వంటి పుస్తకాలు రాశారు.