Page Loader
Smart City Mission: నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు.. నిధులున్నా.. పనుల కొనసాగింపుపై కొరవడిన స్పష్టత 
నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు..

Smart City Mission: నిలిచిపోయిన స్మార్ట్‌ సిటీ మిషన్‌ పనులు.. నిధులున్నా.. పనుల కొనసాగింపుపై కొరవడిన స్పష్టత 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్మార్ట్‌ సిటీ మిషన్‌' కింద ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో వందల కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కానీ ఈ మిషన్‌కు గడువు గత మార్చి 31తో ముగియడంతో, గుత్తేదారులు అధికారుల మౌఖిక ఆదేశాల ప్రకారం అన్ని పురోగతిలో ఉన్న పనులను నిలిపివేశారు. మిషన్‌ పొడిగింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్పష్టత కోరినప్పటికీ,కేంద్ర అధికారుల నుంచి స్పందన రాలేదని సమాచారం. గడువు ముగిసిన నేపథ్యంలో బిల్లుల చెల్లింపుపై సందేహంతో గుత్తేదారులు పని చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో కేంద్రం లేదా రాష్ట్రం అధికారికంగా ప్రకటన విడుదల చేసినప్పుడే ఈ పనులకు మళ్లీ ఊపొస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

వివరాలు 

కరీంనగర్‌ పనుల స్థితి: 

కరీంనగర్‌లో మొత్తం రూ.936.80 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. వీటిలో ఇప్పటివరకు రూ.643.66 కోట్లతో 68 పనులు పూర్తయ్యాయి. మరో రూ.267.74 కోట్ల విలువైన 21 పనులు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అదనంగా, రూ.25.40 కోట్ల విలువైన రెండు పనులు ప్రస్తుతం టెండర్‌ ప్రక్రియలో ఉన్నాయి. రాష్ట్రానికి లభించిన వివరాల ప్రకారం, ఇక్కడ ఇంకా రూ.39 కోట్లు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

వరంగల్‌ పనుల వివరాలు: 

వరంగల్‌లో మొత్తం రూ.944 కోట్ల వ్యయంతో 108 పనులు చేయాలనే లక్ష్యంతో సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) రూపొందించారు. మార్చి 31 నాటికి రూ.600 కోట్ల వ్యయంతో 70 పనులు పూర్తి కాగా, రూ.271 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. అదనంగా, రూ.73 కోట్ల విలువైన నాలుగు పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.723.98 కోట్లు విడుదల చేశాయి. ఇందులో గుత్తేదారులకు రూ.632.59 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.91.39 కోట్ల నిధులు ఖర్చుచేయాల్సి ఉంది.