
National Herald case: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది.
ఈ కేసులో వీరిద్దరూ దాదాపు రూ.142 కోట్లు లబ్ధి పొందినట్టు ఈడీ బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు వాదనలు సమర్పించింది.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పలు మార్లు విచారించిన సంగతి తెలిసిందే.
విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనసాగించారని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈడీతో పాటు సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టాయి.
అయితే సీబీఐ దర్యాప్తు ఒక దశలో ఆగిపోగా, ఈడీ మాత్రం దర్యాప్తును కొనసాగిస్తోంది.
వివరాలు
సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ
ఈ నేపథ్యంలో,2023 నవంబరులో ఈడీ 'అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)'కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయడానికి చర్యలు ప్రారంభించింది.
ఈ ఆస్తుల విషయంలో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. ఆయా భవనాల్లో ఉన్న వారు ఆ ప్రాంగణాలను ఖాళీ చేయాలని స్పష్టం చేసింది.
అలాగే, అద్దెకు ఉంటున్నవారు ఇకపై ఆ అద్దె మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలోనే చెల్లించాలని పేర్కొంది.
అక్రమ ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన చట్టం, అనగా 'ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA)'లోని సెక్షన్ 5(1) కింద ఆ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోందని ఈడీ తెలిపింది.
ఇప్పటికే ఢిల్లీ, ముంబయి, లఖ్నవూ వంటి నగరాల్లో ఉన్న ఆ భవనాలపై నోటీసులు అతికించినట్టు వెల్లడించింది.
వివరాలు
రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్
ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ను ఈడీ దాఖలు చేసింది.
అందులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పలువురు వ్యక్తుల పేర్లు పేర్కొంది.
ఈ వివరాలన్నింటిని ఈడీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ రూపంలో సమర్పించింది.
తాజాగా ఈ కేసుపై కోర్టులో విచారణ జరిగింది.