
Bengaluru stampede: ఆర్సీబీ వేడుకలో తొక్కిసలాట.. ప్రభుత్వానికి 9 ప్రశ్నలు సంధించిన హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో జరిగిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ (RCB) విజయోత్సవ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఈ ఘటనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కఠినంగా నిలదీసింది.
ప్రభుత్వ విధానంపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ, అధికారులపై స్పష్టమైన బాధ్యత అవసరమని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో దర్యాప్తు సీఐడీకి బదిలీ అయినప్పటికీ, ఇప్పటివరకు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అరెస్టులు చేసింది.
అరెస్టయిన నిందితులను కబ్బన్ పార్క్ పోలీసులు కోర్టులో హాజరు పరుస్తున్నారు. విచారణ సందర్భంగా, రాష్ట్రం తరఫున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ను హైకోర్టు నేరుగా ప్రశ్నించింది.
Details
హైకోర్టు వేసిన 9 ప్రశ్నలివే
1. ఈ విజయోత్సవ సభను ఎప్పుడు, ఎవరు, ఎలాంటి ప్రణాళికతో నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు?
2. ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకున్నారా?
3. సభా ప్రాంగణంలో వైద్య సౌకర్యాలు, ఇతర అత్యవసర ఏర్పాట్లు చేశారా?
4. సభకు హాజరయ్యే వ్యక్తుల సంఖ్యపై అంచనా వేసారా?
5. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు ఎంత సమయం పట్టింది?
6. ఇలాంటి భారీ సమూహ కార్యక్రమాల కోసం 50,000 మందికి పైగా ప్రజల కోసం ఎలాంటి SOP రూపొందించారా?
7. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారిక అనుమతులు తీసుకున్నారా?
8. సభను క్రమబద్ధంగా నిర్వహించేందుకు ప్రజల్ని నియంత్రించే చర్యలు తీసుకున్నారా?
9. గాయపడిన వారికి వెంటనే వైద్య సాయం అందించారా? లేదంటే ఎందుకు అందించలేకపోయారు?
Details
కోర్టును సమయం కోరిన ప్రభుత్వం
ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కోర్టును సమయం కోరింది. అలాగే, ఈ సమాధానాలను సీల్డ్ కవర్ రూపంలో సమర్పించాలని తెలిపింది.
ఇక మంగళవారం నాడు కోర్టులో విచారణ సందర్భంగా, ఈ కేసులో అరెస్టయిన RCB అధికారి నిఖిల్ సోసాలే తన అరెస్టు చట్టవిరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు.
అదే సమయంలో ఈ ఈవెంట్ నిర్వహించిన DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఈ వేడుకకు ముఖ్యమంత్రి స్వయంగా అందరినీ ఆహ్వానించారంటూ తమ పిటిషన్లో పేర్కొంది.
ఈ ఘటనపై కోర్టు లోతైన విచారణ జరుపుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ చర్యలు, బాధ్యతలపై మరిన్ని ప్రశ్నలు వెలువడే అవకాశముంది.