రెండో రోజు కొనసాగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలు.. కీలక అంశాలపై తీర్మానాలు
హైదరాబాద్లో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు విస్తృతంగా సమాలోచనలు జరుపుతున్నారు. రాజకీయ, ఆర్థిక, జాతీయ భద్రతా అంశాల్లో ఎన్డీఏ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీడబ్ల్యూసీ కమిటీ భావిస్తోంది. ఈ క్రమంలోనే రాజ్యాంగం,సమాఖ్య వ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్, మహిళా రిజర్వేషన్లు, కుల గణన చేపట్టాలని కేంద్రానికి సూచిస్తూ తీర్మానించింది. ప్రభుత్వరంగ కంపెనీలను కార్పొరేట్లకు కట్టబెడుతూ క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలోని రాజకీయ, ఆర్థిక పరిస్థితులు సహా అంతర్గత, సరిహద్దు వెలుపల నెలకొన్న భద్రతాపరమైన స్థితిగతులపైనా సదస్సులో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కూటమిని విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ తీర్మానించింది.
సాయంత్రం విజయభేరి సభలో గ్యారెంటీలను ప్రకటించనున్న సోనియాగాంధీ
రాజకీయ నిరంకుశత్వం, ఏజెన్సీలను నీరుగార్చడం, సమాఖ్య నిర్మాణంపై దాడి, రాజకీయ అసమానతలు, ఆదాయ పతనం, పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసర వస్తువులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కాంగ్రెస్ తీర్మానించింది. త్వరలోనే ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లోని కీలక నేతలు, తాజా పరిస్థితులపై సీడబ్ల్యూసీ సమావేశంలో లేవనెత్తారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా, ఆశయాలు మాత్రం నెరవేరలేదనేే అభిప్రాయం నెలకొంది. కేసీఆర్, కుటుంబ పాలనతో ప్రజా గొంతు నొక్కుతున్నారని, నిజాం లాగా వ్యవహరిస్తున్నారని కమిటీ భగ్గుమంది. తెలంగాణ వనరుల్ని కేసీఆర్ దారి మళ్లించారని, కాంగ్రెస్ కే ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తోంది. కర్ణాటక మాదిరిగా తెలంగాణలో 6 గ్యారంటీలను సాయంత్రం తుక్కుగూడ వేదికగా విజయభేరి సభలో సోనియా ప్రకటించనున్నారు.