Page Loader
AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు

AP High Court: ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జిలు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు కొలీజియం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి పేర్లను సిఫార్సు చేసింది. ఈ ముగ్గురు కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌ న్యాయవాదులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సేవలందిస్తున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన కొలీజియం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ముగ్గురి పేర్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌తో పాటు హైకోర్టులోని సీనియర్ న్యాయమూర్తుల సూచనల మేరకు మే 15న పంపిన ప్రతిపాదనల ఆధారంగా కొలీజియం పరిగణనలోకి తీసుకుంది.

వివరాలు 

కుంచం మహేశ్వరరావు

తిరుపతికి చెందిన కుంచం మహేశ్వరరావు, తిరుపతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1998లో బార్ కౌన్సిల్‌లో నమోదు అయి, అనంతపురం జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. అనంతరం హైకోర్టుకు వచ్చి, సీనియర్ లాయర్ వేదుల శ్రీనివాస్ దగ్గర ప్రాక్టీసు చేశారు. పలు సివిల్, క్రిమినల్, రాజ్యాంగ సంబంధ కేసులలో అనుభవం కలిగిన మహేశ్వరరావు, హైకోర్టు ప్యానల్ లాయర్‌గా కూడా సేవలందించారు.

వివరాలు 

తూట చంద్ర ధనశేఖర్

తిరుపతి జిల్లాలోని సత్యవేడు నివాసమైన చంద్ర ధనశేఖర్,నెల్లూరులోని వీఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించి,1999లో బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. తన వృత్తిని ప్రారంభించిన తరువాత, 2019లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. చల్లా గుణరంజన్‌ చల్లా గుణరంజన్‌ అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన వారు.వారి తల్లిదండ్రులు చల్లా చంద్రమ్మ, తండ్రి నారాయణ న్యాయవాది.గుణరంజన్ సోదరుడు జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ గారు విశ్రాంత న్యాయమూర్తి. గుణరంజన్ 2001 మార్చి 21న బార్‌ కౌన్సిల్‌లో పేరును నమోదు చేసుకుని,సుప్రీం కోర్టు,హైకోర్టు, వివిధ ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయనకు సివిల్,క్రిమినల్ చట్టాలతో పాటు,ట్యాక్స్,కంపెనీ లా,దివాలా,విద్యుత్ సంబంధిత చట్టాలు, పర్యావరణ చట్టాలలో అపారమైన అనుభవం ఉంది.ఆయన వివిధ ప్రముఖ సంస్థలకు న్యాయ సలహాదారుగా కూడా పని చేశారు.

వివరాలు 

రాష్ట్రపతి ఆమోదం తెలిపితే చాలు 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రస్తుతం 26 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నరేందర్‌ గారిని ఇటీవల సుప్రీం కోర్టు కొలీజియం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. అలాగే, తాజాగా సుప్రీం కోర్టు కొలిజీయం కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులను సిఫార్సు చేసింది. వీరికి రాష్ట్రపతి ఆమోదం ఇచ్చిన తర్వాత హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మొత్తం 37 మంది జడ్జీలకు ఆమోదం ఉంది.