LOADING...
Supreme Court: దివ్యాంగులపై ఎగతాళి.. కమెడియన్లకు సుప్రీం కోర్టు గట్టి హెచ్చరిక
దివ్యాంగులపై ఎగతాళి.. కమెడియన్లకు సుప్రీం కోర్టు గట్టి హెచ్చరిక

Supreme Court: దివ్యాంగులపై ఎగతాళి.. కమెడియన్లకు సుప్రీం కోర్టు గట్టి హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్టాండప్ కమెడియన్ల జోక్‌లలో దివ్యాంగులను ఎగతాళి చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేస్తూ, సంబంధిత కమెడియన్లు తక్షణమే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అంతేకాకుండా జరిమానాలు తప్పవని కూడా హెచ్చరించింది. దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎస్‌ఎంఏ క్యూర్‌ ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇందులో కమెడియన్లు సమయ్ రైనా, విపున్ గోయల్, బాల్‌రాజ్ పరమ్‌జీత్ సింగ్, సోనాలి ఠక్కర్ తదితరులను బాధ్యులుగా పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, సోమవారం కామెడియన్లపై సీరియస్అయింది. యూట్యూబ్ సహా తమ సోషల్ మీడియా ఛానెళ్లలో క్షమాపణలు పోస్ట్ చేయాలని, అలాగే వారు భరించడానికి సిద్ధంగా ఉన్న జరిమానా మొత్తాన్ని కోర్టుకు తెలియజేయాలని ఆదేశించింది.

Details

కేంద్రం తరఫున అటార్నీ జనరల్ హాజరు

ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్ వాదనలు వినిపించగా, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి హాజరయ్యారు. కామిక్స్, ఇన్‌ఫ్లూయెన్సర్ల కోసం మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం అవసరమని ఆయన తెలిపారు. అయితే ఒకే సంఘటనకు ప్రతిస్పందనగా మార్గదర్శకాలు ఉండకూడదని, భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. డొమైన్ నిపుణుల అభిప్రాయం కూడా అవసరమని జస్టిస్ కాంత్ వ్యాఖ్యానించారు.

Details

ఇతరులను ఎగతాళి చేయడం సరైంది కాదు

'సుప్రీంకోర్టు బలమైన సందేశం ఇచ్చింది' అని న్యాయవాది అపరాజిత సింగ్ చెప్పగా, జస్టిస్ కాంత్ బదులిస్తూ- 'క్షమాపణ చెప్పడం ఒక విషయం. కానీ ప్రతిసారీ దీని కోసం ఒక ఫౌండేషన్ కోర్టుకు రావాలా? ఎవరైనా వ్యక్తి బాధితులైతే ఏమి చేయాలని ప్రశ్నించారు. జస్టిస్ బాగ్చి మాట్లాడుతూ- 'హాస్యం జీవనంలో భాగమే. మనం మనల్ని జోకులుగా చేసుకోవచ్చు. కానీ ఇతరులను ఎగతాళి చేయడం సరైనది కాదు. ఇది సున్నితత్వానికి విఘాతం కలిగిస్తుంది. భారతదేశం అనేక సమాజాలతో కూడిన వైవిధ్యభరిత దేశం. ప్రభావశీలులుగా పిలువబడే వారు ప్రసంగాన్ని వాణిజ్యీకరించే క్రమంలో భావాలను గాయపరచలేరని వ్యాఖ్యానించారు.