TDP, Janasena : ఇవాళ టీడీపీ- జనసేన తొలి సమన్వయ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఇవాళ ప్రతిపక్ష తెలుగుదేశం, విపక్ష జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరగనుంది. రాజమహేంద్రవరంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో జరగనున్నాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరుకానున్నారు. మరోవైపు ఆదివారం రాత్రికే లోకేశ్ రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైలుకు అతి సమీపంలోని మంజీరా కన్వెన్షన్లో ఇరు పార్టీల సమన్వయ కమిటీ మొదటి భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
మధ్యాహ్నం 1 గంటకు రాజమహేంద్రవరం రానున్న జనసేనాని
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పవన్ రాజమహేంద్రవరం రానున్నారు. మరోవైపు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు దసరాను పురస్కరించుకుని ములాఖత్ కానున్నారు. ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్, లోకేశ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పొత్తు బంధాన్ని మరింత దృఢంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలక మంతనాలు జరపనున్నారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీలకు సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుని సంయుక్తంగా తమ కార్యాచరణను ప్రకటించనున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీని ఎదుర్కోనేందుకు టీడీపీ, జనసేనలు ఒక్కటయ్యాయి.