CONGRESS: మరోసారి తెలంగాణ కాంగ్రెస్ వరాల జల్లు.. అధికారమే లక్ష్యంగా 'అభయహస్తం'
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,గాంధీ భవన్లో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అదనంగా 36 అంశాలను అందులో చేర్చారు. ఈ క్రమంలోనే అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవభృతి అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 42 పేజీలతో 66 ప్రధాన హామీలతో తాజాగా మేనిఫెస్టోను విడుదల చేశారు.ఆడబిడ్డ పెళ్లికి లక్ష, తులం బంగారంతో పాటు విద్యార్థినిలకు స్కూటీ ఇస్తామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.ఏటా ఏప్రిల్ ఒకటినే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని,జూన్ 1న గ్రూప్-3,గ్రూప్-4 నియామకాలకు నోటిఫికేషన్ వెల్లడిస్తామని తెలిపింది.
2 లక్షల ఉద్యోగాలు భర్తీ : కాంగ్రెస్ మేనిఫెస్టో
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. 6 గ్యారెంటీలివే : మహాలక్ష్మి: మహిళలకు ప్రతి నెల రూ.2500,రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రైతు భరోసా: రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలు,వ్యవసాయ కూలీలకు రూ.12వేలు, వరిపంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ గృహజ్యోతి: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇళ్లు: ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు,ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. యువ వికాసం: విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్. చేయూత : రూ.4వేల పెన్షన్, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా