Page Loader
ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
మెన్హిర్స్‌ వారసత్వ సంపదకు యునెస్కో గుర్తింపునకు యత్నాలు

ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 21, 2023
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని మెన్హిర్స్‌ వారసత్వ సంపదకు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. ఈ మేరకు ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల సంస్థతో సంప్రదింపులకు అవసరమైన పత్రాలు, వారసత్వ సంపద పరిరక్షణ కోసం సాంకేతిక సహకారంపై ఒప్పందం జరిగింది. దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్టుతో తెలంగాణ పురావస్తుశాఖకు మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో తెలంగాణ పర్యాటక, పురావస్తు శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆయా ఒప్పంద పత్రాలను ట్రస్టు కార్యదర్శి కె.ప్రభాకర్‌, ఆచార్య కేపీ రావుకు అందించారు. అయితే 2021 నవంబరు నుంచి అధ్యయనంలో భాగంగా దక్కన్‌ ట్రస్టు బృందం ఈ ప్రదేశాన్ని ఇప్పటికే పలుమార్లు పరిశీలించింది.

DETAILS

చనిపోయిన వారి జ్ఞాపకార్థం ఇలా రాయిని నిలబెట్టారు : చరిత్రకారులు

ముడుమాల్‌ అంటేనే ప్రత్యేకమైన పురావస్తు ప్రదేశం. ఎత్తైన 80 నిలువురాళ్లతో పాటు వేలాది అమరిక రాళ్లు ఉన్న స్థలాన్ని మెన్హిర్స్ అంటారు. దాదాపు 89 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిలువు రాళ్లు విస్తరించాయి. ఒక్కో రాయి దాదాపు 10 నుంచి 14 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. పూర్వకాలంలో పెద్దలు, తమ వారు మరణించాక, ఖననం చేశారని, వారి జ్ఞాపకార్థమే ఇలా రాయిని నిలబెట్టారని కొందరు చరిత్రకారులు అంటున్నారు. ఖగోళ అంశాలతో ఈ నిలువురాళ్లు ముడిపడి ఉన్నట్లు మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దక్షిణాసియాలోనే ఇలాంటి అమరిక ఉన్న అతిపెద్ద ప్రదేశం ఇదే కావడం దీని ప్రత్యేకత.