Page Loader
Flood damages: రూ.9 వేల కోట్లకుపైనే నష్టం.. కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన 
కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన

Flood damages: రూ.9 వేల కోట్లకుపైనే నష్టం.. కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదన 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2024
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 2 వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రానికి రూ. 9,000 కోట్లకుపైనే నష్టం కలిగించాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదికలో వెల్లడించింది. బాధితులకు తక్షణ సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.సూర్యాపేట, నల్గొండ, వరంగల్,మహబూబాబాద్,ములుగు,ఖమ్మం,భద్రాద్రి-కొత్తగూడెం,నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో ఎనిమిది రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొంది. ఖమ్మం,హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, మహబూబాబాద్, మధిర పట్టణాల్లో కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజల జీవన విధానం దెబ్బతిందని వివరించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 5,438 కోట్ల నష్టం ఉన్నప్పటికీ, వాస్తవ నష్టం రెట్టింపుగా ఉంటుందని వెల్లడించింది. 35 మంది మరణించారని, 28,869 ఇళ్లు కూలిపోయాయని, 17,916 మంది నిరాశ్రయులయ్యారని, 75,097 పశువులు మృతి చెందాయని తెలిపింది.

వివరాలు 

వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమావేశం 

కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి కర్నల్‌ కేపీ సింగ్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం బుధవారం రాష్ట్రంలో వరద నష్టాలను పరిశీలించడానికి వచ్చింది. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను చూసిన తర్వాత, సీఎస్‌ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సమావేశంలో విపత్తు నివారణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, వ్యవసాయ, రోడ్లు, భవనాలు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, పశుసంవర్ధక, అటవీ శాఖల అధికారులు నష్ట వివరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

వివరాలు 

తక్షణ చర్యల వల్ల ప్రాణనష్టం తగ్గింది

కేంద్ర బృందంతో సమావేశమైన సీఎస్‌ శాంతికుమారి మాట్లాడుతూ, వాతావరణ శాఖ హెచ్చరికలపై అధికారులు వేగంగా స్పందించడం వల్ల ప్రాణ నష్టం తగ్గిందని తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు క్రమం తప్పకుండా పరిస్థితిని సమీక్షించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించారని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం, సహాయక చర్యలను పెద్ద ఎత్తున చేపట్టేందుకు నిధుల సహాయం చేయాలని కేంద్ర బృందాన్ని కోరారు. ఆ చెట్లు ఎలా కూలాయి? పవర్ పాయింట్ ప్రజంటేషన్ సమయంలో అర్వింద్‌కుమార్‌ ఏటూరునాగారం అడవిలో 332 హెక్టార్లలో చెట్లు కూలినట్లు ప్రస్తావించారు. దీనిపై స్పందించిన కేంద్ర బృందం, చెట్లు కూలడానికి కారణాన్ని తెలుసుకోవడానికి సమగ్ర అధ్యయనం చేయాల్సిందిగా సూచించింది.