హైదరాబాద్ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్-ఫలక్నుమా మెట్రోకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది. ఎంజీబీఎస్ - ఫలక్నుమా మార్గంలో మెట్రో మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ, ఎల్ అండ్ టీ సంస్థకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. మొట్రో రైలు తొలివిడత కింద 69.2 కిలోమీటర్ల మార్గాన్ని ఎల్ అండ్ టీ నేతృత్వంలో నిర్మించారు. అయినప్పటికీ పాతబస్తీకి సంబంధించి పలు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే 6, 7 సంవత్సరాలుగా 5.5 కిలోమీటర్ల మెట్రో పనులు ఈ మార్గంలో వీలుపడలేదు. మెట్రో మార్గానికి మసీదులు పెద్ద ఎత్తున తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి.
మున్సిపల్ ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ తో సీఎం కేసీఆర్ చర్చలు
అయితే మరో మార్గంలో మెట్రో రైలును ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహించిన్పటికీ పనుల్లో పురోగతి సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మున్సిపల్ ఉన్నతాధికారులు, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రమణియన్తో చర్చించారు. మిగిలిన మార్గాన్ని తక్షణం నిర్మించాల్సిందిగా సూచించారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని సదరు సంస్థకు కేసీఆర్ హామీ ఇచ్చినట్టు పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎంజీబీఎస్-ఫలక్నుమా సహా రాయదుర్గం మార్గంలో 2.7 కిలోమీటర్ల మేర పెండింగ్ పనులను నిర్మిస్తే నగర వాసులకు ఆధునిక ప్రజారవాణా సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.