
Child Trafficking: సూర్యాపేటలో దారుణం.. దత్తత పేరుతో శిశువులను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోంది. జాలి, దయ వంటి గుణాలు కనుమరుగవుతున్నాయి.
"దత్తత" అనే పవిత్రమైన పదాన్ని కూడా తమ లోభానికి ఆయుధంగా మార్చి అమానవీయానికి పాల్పడుతున్నారు. శిశువులను దత్తత పేరుతో తీసుకొని, వారికి ఒక ప్రేమతో కూడిన కుటుంబం కల్పించాల్సిన సమయంలో.. ఈ గ్యాంగ్, చిన్నారులను అమ్మకానికి పెట్టి డబ్బు సంపాదిస్తున్న దారుణం సూర్యాపేటలో బయటపడింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంగా పనిచేస్తూ,అంతరాష్ట్ర స్థాయిలో శిశువులను అక్రమంగా దత్తత తీసుకొని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 మంది చిన్నారులను రక్షించి,సురక్షితంగా తరలించారు.
పోలీసులు విచారించగా భయంకరమైన నిజాలు వెలుగుచూశాయి. ఈ ముఠా ఆకృత్యాలు తెలుసుకున్న పోలీసులు కూడా షాక్కు గురయ్యారు.
వివరాలు
5 లక్షల నుంచి 10 లక్షల వరకు అమ్మకం
ఈ ముఠా గత మూడేళ్లుగా శిశువుల అక్రమ విక్రయాల్లో పాల్గొంటోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 28 మంది పిల్లలను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించారు.
మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి తక్కువ ధరలకు శిశువులను కొనుగోలు చేసి, వాటిని తెలంగాణకు తరలించి, అక్కడ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు అమ్ముతున్నారు.
సూర్యాపేటకు చెందిన విద్యానగర్ ప్రాంతానికి చెందిన నక్క యాదగిరి (ఏ1), ఉమారాణి (ఏ2) దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ,సంతానం లేని తల్లిదండ్రుల సమాచారం సేకరించేవారు.
పోలీసులు గుర్తించిన వివరాల ప్రకారం,వీరు శిశు విక్రయ ముఠాతో కలిసి అక్రమంగా శిశువులను దత్తత పేరుతో తీసుకొని అమ్ముతున్నారు.
ఇప్పటివరకు ఈ దంపతులు 28 మంది పిల్లలను విక్రయించినట్లు వెల్లడైంది.
వివరాలు
ఇలా.. గ్యాంగ్ గుట్టు రట్టు..
ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే వీరు 10 మంది శిశువులను అమ్మారు.
వీరిలో ఏడుగురు అబ్బాయిలు,ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.వీరిని గుర్తించిన పోలీసులు శిశు విహార్ కు తరలించారు. ఈ పిల్లలందరూ మూడేళ్ల వయస్సులోపువారే.
టేకుమట్లకు చెందిన అంజయ్య, నాగయ్య అనే ఇద్దరు వ్యక్తులు శిశువులను దత్తతగా తీసుకున్నారు.
బుధవారం ఉదయం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ ముఠా కార్యకలాపాలు బహిరంగమయ్యాయి.
వారి ఇచ్చిన సమాచారంతో నక్క యాదగిరి, ఉమారాణి అనే దంపతులను కూడా అరెస్ట్ చేశారు.
మరో శిశువు అక్రమ రవాణా గురించి మాట్లాడేందుకు సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద గ్యాంగ్ సభ్యులు సమావేశమైనట్టు సమాచారం అందడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు మిగిలిన సభ్యులను కూడా అరెస్ట్ చేశారు.
వివరాలు
తల్లిదండ్రుల కన్నీటి గాథ
వీరి చేతిలో చిక్కిన శిశువులను కొనుగోలు చేసిన తల్లిదండ్రులు, ఆ పిల్లలను తమ కన్న పిల్లలుగా ప్రేమతో పెంచుతున్నారు.
ఇప్పుడు వారు పోలీసులు తీసుకెళ్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుని, శిశువులను తమ వద్దే ఉంచాలని వేడుకుంటున్నారు.
తమ పిల్లలను దూరం చేయొద్దని ప్రాణం పెట్టి ఎదురు చూసిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.
వివరాలు
ముఠా అంతరంగాలు:
ఈ శిశు విక్రయ ముఠా, అమాయక గర్భిణుల్ని లక్ష్యంగా చేసుకుని వారిని మోసం చేస్తూ, పుట్టిన వెంటనే పిల్లలను అమ్మేస్తోంది.
గ్యాంగ్ విక్రయించిన శిశువులను పోలీసులు శిశు విహార్కు తరలించారు.
మొత్తం 16 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు, వారిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు.
నిందితులకు గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోనూ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.