
Telangana Rain: తెలంగాణలో మూడ్రోజులపాటు ఆ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు.. వాతావరణ శాఖ అలెర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వేర్వేరు జిల్లాలలో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ పి. లీలారాణి తెలిపారు.
ఈవర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40కి.మీ వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
అలాగే వచ్చే ఐదురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పగటి తాపనతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయని ఆమె వివరించారు.
పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 42డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నదని, రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 27డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
గాలి వేగం గంటకు 30 నుండి 40 కి.మీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 43 డిగ్రీల మధ్య ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 31 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేయబడింది.
వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఈ రోజు అంటే శుక్రవారం రోజున ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.
గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని వెల్లడించారు.
వివరాలు
మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
శనివారం నాడు కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్కర్నూల్ జిల్లాలలో కూడా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆదివారం నాడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.