Jammu & Kashmir: బారాముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ పోలీసు రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు. ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. నగరంలోని గంటముల్లా బాలా ప్రాంతంలోని స్థానిక మసీదులో రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) మహమ్మద్ షఫీ మీర్ అజాన్ (ప్రార్థనలు) చేస్తున్నప్పుడు ఈ దారుణం జరిగినట్లు పేర్కొన్నారు. సంఘటన తర్వాత పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు ప్రారంభించారు. గత నెలలో శ్రీనగర్లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో రాష్ట్ర పోలీసు ఇన్స్పెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈద్గా మైదానంలో ఇన్స్పెక్టర్ స్థానిక అబ్బాయిలతో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది.