Page Loader
కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో మాట్లాడిన ప్రధాని మోదీ

కొందరు ఎంపీల ప్రవర్తన దేశాన్ని నిరాశ పర్చింది: రాజ్యసభలో ప్రధాని మోదీ

వ్రాసిన వారు Stalin
Feb 09, 2023
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను దేశం సీరియస్‌గా తీసుకుంటోందని, ఈ క్రమలో కొంతమంది ఎంపీల ప్రవర్తన ప్రజలను నిరాశకు గురి చేసిందని ప్రధాని మోదీ అన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ఒక రోజు తర్వాత గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ఆయన పాల్గొని సమాధానం చెప్పారు. ప్రతిపక్షాల 'మోదీ, అదానీ భాయ్‌ భాయ్‌' నినాదాలు చేస్తుండగానే మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పాలనలో దేశం అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన వల్ల ఆరు దశాబ్దాలు వృథా అయ్యాయన్నారు. ఆ సమయంలోనే చిన్న దేశాలు పురోగమించినట్లు మోదీ గుర్తు చేసారు.

రాజ్యసభ

మా ప్రభుత్వం అనేక విజయాలను సాధించింది: మోదీ

పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనడానికి తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. అయితే సమస్యలకు పరిష్కాలను అందించాల్సిన వారు(కాంగెస్) లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వంటగ్యాస్ కనెక్షన్‌ను సులభతరం చేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు తెరవడం, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వరకు తమ ప్రభుత్వం అనేక విజయాలను సాధించినట్లు మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా, అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు. ఈ సమయంలో సభలో గందరగోళం ఏర్పడింది.