Page Loader
Ponnam Prabhakar: సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు
సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు

Ponnam Prabhakar: సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టీసీలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కార్మిక సంఘాల నేతలు మంత్రిని కలవడంతో, తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థికంగా మళ్లీ గాడిలో పడుతున్నదని, సంస్థ నష్టాల నుంచి కోలుకుంటున్నదని తెలిపారు. సమస్యలు తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఈ దశలో సమ్మె చేయకూడదని కార్మిక సంఘాలకు సూచించారు.

Details

గత ప్రభుత్వంపై విమర్శలు 

గత పదేళ్ల పాలనలో ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి ఆరోపించారు. ఒక్క కొత్త బస్సు కొనకపోవడమే కాకుండా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సీసీఎస్‌ (CCS), పీఎఫ్‌ (PF) నిధులు కూడా వినియోగించుకున్నారని విమర్శించారు.

Details

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యలు 

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ కాలంలో సంస్థ ఉద్యోగులకు బాండ్‌ కింద రూ.400 కోట్లు చెల్లించామని మంత్రి వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌ రూ.1,039 కోట్లు, సీసీఎస్‌ బకాయిలు రూ.345 కోట్లు చెల్లించిన విషయాన్ని వెల్లడించారు. కారుణ్య నియామకాల కింద 1,500 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. అలాగే, ఆర్టీసీలో కొత్తగా 3,038 పోస్టులకు నియామకాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు.