తమిళనాడు: బీజేపీతో పొత్తునుతెంచుకున్నఏఐఏడీఎంకే ; 2024 లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్
తమిళనాడులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం తర్వాత సోమవారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)తో అన్నాడీఎంకే బంధాన్ని తెంచుకుంది. కాషాయ పార్టీ ఏఐఏడీఎంకే మాజీ నేతలపై అనవసర వ్యాఖ్యలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి నేతృత్వంలోని పార్టీ 2024 లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేక ఫ్రంట్కు నాయకత్వం వహిస్తుందని చెప్పారు. ఈరోజు నుంచి బీజేపీ,ఎన్డీయే కూటమితో ఏఐఏడీఎంకే తెగతెంపులు చేసుకుంటోందని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్న ఏఐఏడీఎంకే
గత ఏడాది కాలం నుండి బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా మాజీ నేతలు,మా ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామిపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఏఐఏడీఎంకేకు చెందిన కేపీ మునుసామి వార్తా సంస్థ ANI తో పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర నాయకత్వం తమ విధానాలను విమర్శించడంతో పాటు ద్రావిడ ఐకాన్, దివంగత సిఎన్ అన్నాదురై,దివంగత ముఖ్యమంత్రి జె జయలలితల పరువు తీసుతున్నారని తెలిపారు. పొత్తు ముగింపు సందర్భంగా పార్టీ కార్యాలయం వెలుపల పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య చీలిక
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ద్రావిడ దిగ్గజం సిఎన్ అన్నాదురైపై తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత రెండు పార్టీల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. 1956లో మధురైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాదురై హిందూమతాన్ని అవమానించారంటూ బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. అన్నాదురై తను హిందూ మతంపై చేసిన వ్యాఖ్యల తర్వాత మదురైలో తలదాచుకోవాల్సి వచ్చిందని, క్షమాపణలు చెప్పిన తర్వాతే బయటకు వచ్చారని అన్నామలై అన్నారు. అన్నామలై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారు.
అన్నామలైకి మద్దతుగా బీజేపీ
తన పార్టీకి, అన్నాడీఎంకేకు మధ్య ఎటువంటి సమస్య లేదని సమర్థించారు. తాను అన్నాదురై గురించి చెడుగా మాట్లాడలేదని, 1956 నాటి సంఘటనను మాత్రమే చెప్పానని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని అన్నాడీఎంకేను ఆ పార్టీ కోరబోదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, బిజెపి తమిళనాడు రాష్ట్ర చీఫ్ అన్నామలైకి గట్టిగా మద్దతు ఇస్తోంది. ఎఐఎడిఎంకె 2019 లోక్సభ ఎన్నికలు అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపితో మిత్రపక్ష భాగస్వామిగా ఉంది.