LOADING...
Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ

Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా పాకిస్థాన్ చేసిన దూకుడు చర్యలకు భారత్ ధీటైన బదులు ఇచ్చింది. శత్రుదేశం పంపిన డ్రోన్లు, క్షిపణులను భారత్ సమర్థవంతంగా కూల్చేయడమే కాకుండా, పాక్‌కు చెందిన ముఖ్యమైన సైనిక స్థావరాలను కూడా సమర్థవంతంగా ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ అయిన లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భారత్‌ అవసరమైతే పాకిస్థాన్ మొత్తాన్ని లక్ష్యంగా చేసుకునే స్థాయిలో దాడి చేయగల శక్తి కలిగి ఉంది అని స్పష్టం చేశారు. పాక్ తన రక్షణ కేంద్రాలను ఎక్కడికి తరలించినా, భారత్ వారిని ఎక్కడైనా వెంబడించి ఉక్కుపాదం మోపగలదని హెచ్చరించారు.

వివరాలు 

దాకునేందుకు ఏదైనా గుహను వెతుక్కోవాల్సిందే

"పాకిస్థాన్‌లోని ప్రతి ప్రాంతం భారత్ రేంజ్‌లో ఉంది. సరిహద్దుల నుంచి మేము ఆ దేశంలోని ఏ ప్రదేశానికైనా దాడి చేయగలము. వారు తమ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను రావల్పిండి నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలకు తరలించినా కూడా, మేము అక్కడ దాడి చేస్తాము.అప్పుడు వాళ్లు తప్పించుకునేందుకు దాకునేందుకు ఏదైనా గుహను వెతుక్కోవాల్సిందే" అని ఎద్దేవా చేశారు. అలాగే, ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా జరిగేందుకు ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, దీర్ఘశ్రేణి డ్రోన్లు,గైడెడ్ క్షిపణులు కీలకపాత్ర పోషించాయి అని వివరించారు.

వివరాలు 

ఇదే దృష్టితో మేము ఆపరేషన్‌ చేపట్టాం

"సైన్యం కర్తవ్యం మన దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించడమే.సరిహద్దుల్లో జరుగుతున్న చొరబాట్లను నిరోధించడమే కాకుండా,ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా పరిస్థితిని సమర్థంగా నిర్వహించడమే మా ప్రాధాన్యత.ఇదే దృష్టితో మేము ఆపరేషన్‌ చేపట్టాం"అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం కారణంగా కేవలం సైనికులు మాత్రమే కాకుండా, వారికి చెందిన కుటుంబాలు, మొత్తం భారత దేశం గర్వపడుతోందని లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ డి కున్యా ఆనందాన్ని వ్యక్తం చేశారు.