
PM Modi: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. భద్రతా అంశాలపై చర్చించనున్న ప్రధాని
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. 'ఆపరేషన్ సిందూర్' ప్రారంభమైన తరువాత తొలిసారిగా కేబినెట్ భేటీ జరగడం ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగించింది.
ప్రధాన మంత్రితో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత త్వరలో ఏడాది పూర్తి కానుంది.
ఈ దశలో జరగనున్న కేబినెట్ సమావేశం పాలనాపరంగా కీలకమైనదిగా చెప్పొచ్చు. ఢిల్లీకి చెందిన సుష్మా స్వరాజ్ భవన్లో ఈ భేటీ నిర్వహించనున్నారు.
ఇందులో 'ఆపరేషన్ సిందూర్'కు దారితీసిన పరిణామాలు, ఆపరేషన్ అనంతరం చోటు చేసుకున్న పరిస్థితులపై ప్రధాని మోదీ తన సహచర మంత్రులకు వివరించే అవకాశముంది.
Details
కుల గణన, జనాభా లెక్కలపై నిశితంగా చర్చించే అవకాశం
తీవ్రవాద కార్యకలాపాలను అణిచివేయడంలో త్రివిధ దళాల పాత్ర, ఈ చర్యల్ని ప్రజల్లోకి చక్కగా తీసుకెళ్లే రీతిపై కూడా చర్చ జరగనుంది.
ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి భిన్న కోణాల నుంచి ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతకీ, కేబినెట్ సమావేశంలో మరొక ప్రధాన అంశంగా జనాభా లెక్కలు, కుల గణనపై చర్చ జరుగనుంది.
ఇప్పటికే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కుల గణన అంశంపై చర్చ జరగిన విషయం విదితమే.
ఇప్పుడు కేంద్ర కేబినెట్ స్థాయిలోనూ ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఈ మేరకు బుధవారం జరగబోయే కేబినెట్ భేటీ... దేశ రాజకీయ, రక్షణ, పరిపాలనా పరంగా కీలక మలుపుగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.