Page Loader
JD Vance: నేడు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు
నేడు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు

JD Vance: నేడు భారత పర్యటనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్- ఢిల్లీలో భద్రత పెంచిన పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ తన భార్య ఉషా చిలుకూరి వాన్స్‌తో పాటు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఈరోజు భారత్‌కు విచ్చేస్తున్నారు. జేడీవాన్స్ ఉపాధ్యక్ష పదవిలో బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనకు ఇది తొలి భారత పర్యటన. నాలుగురోజులపాటు సాగనున్నఈపర్యటనలో జేడీ వాన్స్ కుటుంబం ఢిల్లీతో పాటు మరికొన్ని ప్రధాన నగరాలను సందర్శించనున్నారు. వారి రాకతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను గణనీయంగా పెంచారు.ఇప్పటికే భద్రతా బలగాలు అన్ని ప్రాంతాల్లో మాక్ డ్రిల్లులు నిర్వహించాయి. జేడీవాన్స్ కుటుంబానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఢిల్లీ పోలీస్,ట్రాఫిక్ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం 10గంటలకు జేడీ వాన్స్ దంపతులు పిల్లలైన ఈవాన్,వివేక్,మిరాబెల్‌తో కలిసి ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌లో దిగనున్నారు.

వివరాలు 

స్వామినారాయణ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించనున్న జేడీ వాన్స్ కుటుంబం

వారి వెంట అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ఐదుగురు సీనియర్ అధికారులు కూడా ఉంటారు. వారి స్వాగతానికి భారత ప్రభుత్వానికి చెందిన కేంద్ర మంత్రులు,ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ చేరుకున్న కొద్ది గంటల తరువాత జేడీ వాన్స్ కుటుంబం స్వామినారాయణ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ సందర్శనలో ఎలాంటి భద్రతా లోపం ఉండకుండా ముందస్తుగా ఆలయం, పరిసర ప్రాంతాల్లో భద్రతా లియాజన్ నిర్వహించి సెక్యూరిటీ తనిఖీలు పూర్తిచేశారు. ఇదే సందర్భంలో వారు సంప్రదాయ భారతీయ హస్తకళా ఉత్పత్తులు విక్రయించే షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా సందర్శించనున్నట్లు అధికార వర్గాలు పీటీఐకి వెల్లడించాయి. అంతేగాక, సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి జేడీ వాన్స్ కుటుంబం జైపూర్,ఆగ్రాకు వెళ్లనున్నట్లు సమాచారం.

వివరాలు 

ప్రధాని మోదీతో సమావేశం 

జేడీ వాన్స్ పర్యటన ప్రధానంగా వ్యక్తిగతంగానే ఉన్నప్పటికీ, భారత ప్రభుత్వం అధికారిక ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ అతి విశిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. సోమవారం సాయంత్రం 6:30గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జేడీ వాన్స్ కుటుంబానికి వ్యక్తిగత ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో మోదీ,జేడీ వాన్స్ దంపతులతో కలిసి ద్వైపాక్షిక సంబంధాలపైన, వాణిజ్య ఒప్పందాలపైన, రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించనున్నారు. ఈ భేటీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ,అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా కూడా పాల్గొంటారు. చర్చల అనంతరం ప్రధాని మోదీ జేడీ వాన్స్ కుటుంబంతో పాటు అమెరికా అధికారులకు అధికారిక విందును అందించనున్నారు.