Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అధికారులు జాతీయ మీడియా కి తెలిపారు. నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలోని శిధిలాలను తొలగించడంలో భారీ,అధునాతన డ్రిల్లింగ్ యంత్రాలు విఫలమవడంతో.. ఒక రోజంతా రాట్ హోల్ మైనింగ్ ఆపరేషన్ తర్వాత మొత్తం 41 మంది కార్మికులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా తరలించారు. కార్మికులను బయటకు తీసిన వెంటనే, ప్రధాన మంత్రి కార్మికులను విజయవంతంగా,సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు చేసిన వారాల ప్రయత్నాలను ప్రశంసిస్తూ.. X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. మిషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు అద్భుతమైన కృషి చేశారని ఆయన అన్నారు.
కొండచరియలు విరిగిపడి సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది నిర్మాణ కార్మికులు
ఉత్తరకాశీలో మా సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. సొరంగంలో చిక్కుకున్న స్నేహితులారా మీ ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని కలిగిస్తుంది. మీ అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని ట్వీట్ చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మా స్నేహితులు ఇప్పుడు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం. ఈ సమయంలో వారి కుటుంబాలన్నీ చూపించిన సహనం, ధైర్యం అద్బుతమన్నారు. నవంబర్ 12న కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగమైన సిల్క్యారా సొరంగంలో కొంత భాగం కొండచరియలు విరిగిపడటంతో 41 మంది నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు.