LOADING...
Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంపై ప్రధాని మోదీ హర్షం 
వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంపై ప్రధాని మోదీ హర్షం

Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంపై ప్రధాని మోదీ హర్షం 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన, రాజకీయంగా విపక్షాలు, అధికార పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025కు ఉభయ సభలు తుది ఆమోదం తెలుపాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, ఇది చరిత్రలో ఒక కీలక మలుపుగా అభివర్ణించారు. వక్ఫ్ వ్యవస్థలో అనేక దశాబ్దాలుగా జవాబుదారీతనం, పారదర్శకత లోపించాయని గుర్తుచేసిన ప్రధాని, ఈ కొత్త బిల్లుతో ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అంతేకాదు, ఇప్పటివరకు అవకాశాలు దక్కని వారికి తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే వేదిక లభిస్తుందని చెప్పారు.

వివరాలు 

ఇది ఓ చారిత్రక ఘట్టం

ప్రస్తుతం థాయిలాండ్‌లో బిమ్‌స్టెక్ సమావేశానికి హాజరైన ప్రధాని, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "వక్ఫ్ సవరణ బిల్లు మరియు ముస్లింల వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ఓ చారిత్రక ఘట్టం. ఇది సమాజంలో సమానత, పారదర్శక పాలన, సంపూర్ణ వృద్ధి దిశగా మన సమిష్టి ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ చట్టాన్ని రూపుదిద్దడంలో సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న పార్లమెంటరీ సభ్యులు అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే, బిల్లుకు సంబంధించిన సవరణల కోసం విలువైన సూచనలు పంపిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

వివరాలు 

సమాజంలో న్యాయం చేసే కొత్త యుగంలో..

అలాగే, గత కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ పరిపాలనలో పారదర్శకత మరియు బాధ్యత లేకపోవడం, ముఖ్యంగా ముస్లిం మహిళలు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న ముస్లింలకు నష్టాన్ని కలిగించిందని ప్రధాని గుర్తుచేశారు. ఇప్పుడు ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించడం ద్వారా వారి హక్కులకు రక్షణ కలుగుతుందని చెప్పారు. ఈ చర్యతో సమాజంలో న్యాయం చేసే కొత్త యుగంలో అడుగుపెడుతున్నామని తెలిపారు. ప్రతి పౌరుడి గౌరవాన్ని పరిరక్షించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా కలిసి నడుస్తూ బలమైన, సమ్మిళిత భారతదేశాన్ని నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

వివరాలు 

యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్

ఇదిలా ఉండగా, బుధవారం నాడు లోక్‌సభలో ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు.. 'ముస్లింల వక్ఫ్ (ఉపసంహరణ) బిల్లు' గురువారం నాడు రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఇప్పుడు ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించబడనున్నాయి. రాష్ట్రపతి సంతకం తర్వాత ఇది చట్టబద్ధంగా మారనుంది. ఈ బిల్లును ప్రభుత్వం "యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ బిల్" (UMMEED-UMEED) అనే పేరుతో అభివర్ణించింది.

Advertisement