
Amit Shah: సింధూ నది నీరు పాకిస్థాన్కు అందకుండా చేస్తాం: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ ఒప్పందం నిబంధనలను పాకిస్థాన్ (Pakistan) ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లు అన్యాయంగా నీటిని అందుకున్న పాకిస్థాన్ ఇకపై నీటి కొరతతో అల్లాడక తప్పదని చెప్పారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా, 'అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం. కానీ సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు భారత్కు ఉంది. అదే చేశాం. ఈ ఒప్పందం పీఠికలో రెండు దేశాలు శాంతి, పురోగతి సాధించాలనే అంశాన్ని పొందుపరిచారు. కానీ పాకిస్థాన్ ఈ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు రక్షించడానికి ఇంకేమీ ఉండదని వ్యాఖ్యానించారు.
Details
కెనాల్ నిర్మిస్తాం
'భారతానికి హక్కుగా ఉన్న నీటిని సమర్థంగా వినియోగిస్తాము. కెనాల్ నిర్మించి పాకిస్థాన్కు వెళ్లే నీటిని రాజస్థాన్కు మళ్లిస్తాం. ఇన్నాళ్లు పాకిస్థాన్ అన్యాయంగా నీటిని అందుకుంది. ఇకపై ఆ దేశం గొంతెండక తప్పదని అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శించారు. 1960లలో భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్ వ్యవసాయానికి అవసరమయ్యే నీటిలో 80 శాతం సరఫరా ఇదే ఒప్పందం కింద జరుగుతోంది. పాకిస్థాన్ జీడీపీలో 25 శాతం ఈ నదుల నుంచే లభిస్తుంది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాకిస్థాన్ కంటిమీద కునుకు లేకుండా అయ్యింది. ఈ నిర్ణయం పాకిస్థాన్ భవిష్యత్తుపై ప్రభావం చూపనుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
Details
మహిళా రిజర్వేషన్లతోనే 2029 ఎన్నికలు
ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు తదితర అంశాలపై కూడా అమిత్ షా స్పందించారు. 'నియోజకవర్గాల పునర్విభజనపై ఎవరూ అసంతృప్తికి గురికావాల్సిన అవసరం లేదు. అన్ని అంశాలను సమతుల్యంగా పరిగణనలోకి తీసుకుంటూ ప్రణాళిక రూపొందిస్తాం. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందునే డీఎంకే ఈ అంశాన్ని వ్యతిరేకిస్తోందని చెప్పారు. తదుపరి, 2029 లోక్సభ ఎన్నికలు మహిళా రిజర్వేషన్లతోనే నిర్వహిస్తామని ఆయన ధృవీకరించారు. లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం తెలిపింది.