Page Loader
Amit Shah: 2026 లోపు నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం.. అమిత్‌ షా హెచ్చరిక!
2026 లోపు నక్సలిజం తుడిచిపెట్టేస్తాం.. అమిత్‌ షా హెచ్చరిక!

Amit Shah: 2026 లోపు నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తాం.. అమిత్‌ షా హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 29, 2025
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

నక్సలైట్ల హత్యాకాండను తక్షణమే నిలిపివేసి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం, స్థానిక పాలిటెక్నిక్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ప్రసంగించిన ఆయన.. నక్సలిజాన్ని దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని తెలిపారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ద్వారా పాకిస్థాన్‌ మనల్ని భయపెట్టాలనుకుంది. కానీ, తర్వాత మేము చూపిన ప్రతిచర్యతో ప్రపంచం మొత్తం భారత శక్తిని గుర్తించింది. మోదీ ఉగ్రవాదమే కాదు, దేశంలో నక్సలిజాన్ని కూడా తుదముట్టించాలని సంకల్పించారు. 2026 మార్చి30 లోపు దేశంలో నక్సలిజం మిగలదు. ఇప్పటికీ 10 వేల మంది నక్సలైట్లు లొంగిపోయారు. నక్సలైట్లు ప్రజా జీవన స్రవంతిలోకి రావాలని ఆయన అన్నారు.

Details

తెలంగాణలో అధికారంపై విశ్వాసం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే భాజపా విజయం ఖాయమని అన్నారు. ఎంపీ అర్వింద్‌ చేసిన ప్రయత్నాల ఫలితంగా పసుపుబోర్డు సాధించగలిగామని, ఇప్పుడది నిజామాబాద్‌లో కార్యాలయం స్థాపించడంతో రైతులకు పెద్ద ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నిజామాబాద్‌ రైతులు నాలుగు దశాబ్దాలుగా పసుపుబోర్డు కోసం పోరాడారు. మోదీ ఇచ్చిన హామీ మేరకు బోర్డును కేవలం ఇచ్చినంతే కాదు, దానికి ఛైర్మన్‌గా తెలంగాణ వాసినే నియమించాం. భారత్‌ ఆర్గానిక్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎక్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సంస్థలు కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం. ఫలితంగా నిజామాబాద్‌ పసుపు అమెరికా, యూరప్‌ మార్కెట్లను చేరుతుందని చెప్పారు.

Details

బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది

అదేవిధంగా రాష్ట్రంలో అవినీతి వ్యవహారాలను తేల్చారు. ధరణి పోర్టల్, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతికి పాల్పడ్డదని, భారాస పాలన పూర్తిగా అవినీతి మయమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతూ, "తెలంగాణను దిల్లీకి ఏటీఎంగా మార్చేసిందని విమర్శించారు. సభలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు అర్వింద్‌, లక్ష్మణ్‌తోపాటు అనేక మంది నేతలు పాల్గొన్నారు.