
Bengaluru Stampede: RCB విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులో తొక్కిసలాటకు దారితీసిన కారణాలివేనా?
ఈ వార్తాకథనం ఏంటి
సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఐపీఎల్ ట్రోఫీని ఎత్తుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆనందోత్సాహం కొన్ని గంటలకే కరిగిపోయింది.
ఆటగాళ్లను కళ్లారా చూసేందుకు వేలాది మంది అభిమానులు మైదానం వద్దకు తరలిరావడంతో బుధవారం పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటుచేసుకుంది.
దీనివల్ల ఉత్సవం వాతావరణం విషాదంగా మారిపోయింది. ఈ ఘటనకు పలు కారణాలున్నట్టు వెలుగులోకి వస్తోంది.
ఉచిత టికెట్లు ఇస్తున్నారన్న వదంతులు,స్టేడియం వద్ద గేట్లు మూసివేత,అతిపెద్ద సంఖ్యలో జనం మద్దతు, వీటి వల్ల ఏర్పడిన తోపులాట... ఇవే దుర్ఘటనకు దారితీసిన అంశాలుగా భావిస్తున్నారు.
వివరాలు
ఫ్రీ టికెట్ల ప్రచారంతో..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేవలం 35,000 మందికే కూర్చోవడానికి అవకాశం ఉంది.
కానీ బుధవారం సాయంత్రానికి దాదాపు 3 లక్షల మంది అభిమానులు స్టేడియం వద్దకు చేరుకున్నారు.
ఈ స్టేడియంలో మొత్తం 21 స్టాండ్లు,13 గేట్లు ఉన్నాయి.వాటిలో 9వ, 10వ గేట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సభ్యుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు.
అభిమానుల కోసం 5, 6, 7వ నంబరు గేట్ల ద్వారా ప్రవేశం కల్పించాల్సి ఉంది.
ఇందులో ముఖ్యంగా 7వ గేట్ నుంచి స్టేడియం ప్రధాన ప్రవేశ ద్వారం స్పష్టంగా కనిపిస్తుంది.
ఆ ద్వారం నుంచే RCB జట్టు లోపలికి అడుగుపెడుతుంది.దీంతో వేలాది మంది అదే గేట్ వద్ద గుమికూడారు.
వివరాలు
ఫ్రీ టికెట్ల ప్రచారంతో..
పాస్లు ఉన్నవారికే స్టేడియంలోకి వెళ్లేందుకు అనుమతి ఉన్నా, చాలా మంది టికెట్లేవీ లేకుండానే అక్కడకు వచ్చారు.
అదే సమయంలో 'సేవా భావంతో ఉచిత టికెట్లు ఇస్తున్నారు' అన్న వదంతులు వ్యాపించడంతో మరింత మంది అక్కడికి పరుగులు తీశారు.
దీంతో గందరగోళం ఏర్పడి, టికెట్ల కోసం తోసుకోవడం ప్రారంభమైంది. అలా ఒక్కసారిగా తొక్కిసలాట మొదలై, ఎక్కువ నష్టం ఏడో గేట్ వద్దనే జరిగింది.
వివరాలు
గేట్లు విరిగి..
ఈ భారీ సమూహాన్ని నియంత్రించేందుకు సుమారు 5,000 మంది పోలీసులను మోహరించారు.
కానీ ఊహించిన దానికంటే ఎక్కువగా అభిమానులు రావడంతో పరిస్థితిని కంట్రోల్ చేయడం కష్టమైపోయింది.
స్టేడియం గేట్లు చిన్నగా ఉండటంతో మైదానంలోకి ప్రవేశించడానికి సరైన మార్గం లేకుండా పోయింది.
''స్టేడియం గేట్లు చిన్నవిగా ఉండటం అభిమానులు కిక్కిరిసిపోవడంతో.. కొన్నిచోట్ల గేట్లు విరిగిపోయాయి. ఇదంతా రద్దీ ఎక్కువగా ఉండటం వల్లే జరిగిందని అనిపిస్తోంది,'' అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు.
ఇదిలా ఉండగా, టికెట్లు ఉన్నప్పటికీ తమను లోపలికి అనుమతించలేదని కొంతమంది అభిమానులు ఆరోపిస్తున్నారు.
వివరాలు
ప్రకటనలో గందరగోళం..
RCB జట్టు బుధవారం ఉదయం చేసిన ప్రకటన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు విధానసౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడ్ ఉండబోతోందని తెలియజేశారు.
అయితే పెద్ద సంఖ్యలో అభిమానులు రావొచ్చని ముందుగానే అంచనా వేసిన పోలీసులు ఈ ర్యాలీకి అనుమతినివ్వలేదు.
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఉదయం 11:56కి 'పరేడ్ ఉండదని, కేవలం స్టేడియంలో అభినందన కార్యక్రమం మాత్రమే జరుగుతుందని' ప్రకటించారు.
అయితే మధ్యాహ్నం సమయంలో RCB యాజమాన్యం మరో ప్రకటన విడుదల చేసింది.
వివరాలు
ప్రకటనలో గందరగోళం..
పరేడ్ నిర్వహించనున్నట్టు పేర్కొంటూ, అభిమానులు నిబంధనలు పాటించాలని కోరింది.
దీంతో అభిమానుల్లో మరింత అయోమయం నెలకొంది. పరేడ్ జరుగుతుందా లేదా అనే స్పష్టత లేకపోవడంతో చాలామంది నేరుగా స్టేడియంలోకే వెళ్లేందుకు యత్నించారు.
టికెట్లు లేని కొంతమంది గేట్ల మీదుగా దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకున్న పోలీసుల లాఠీఛార్జ్తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.