Page Loader
#NewsBytesExplainer: బైసరన్ వ్యాలీ భద్రతా అనుమతులపై ఎవరు ఏమంటున్నారు?
బైసరన్ వ్యాలీ భద్రతా అనుమతులపై ఎవరు ఏమంటున్నారు?

#NewsBytesExplainer: బైసరన్ వ్యాలీ భద్రతా అనుమతులపై ఎవరు ఏమంటున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎప్పటిలాగే ఏప్రిల్ 22న కూడా జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బైసరన్ వ్యాలీకి భారీగా సందర్శకులు వచ్చారు. ఈ లోయ పహల్గాం ప్రధాన బజార్‌కు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ రోజు మధ్యాహ్నం ఆ ప్రాంతంలో తీవ్రవాద దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 25 మంది పర్యాటకులు కాగా, మరొకరు స్థానిక యువకుడు. ఇటీవలి 30 ఏళ్లలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన అతి పెద్ద ఉగ్రదాడి ఇదేనని భావిస్తున్నారు.

వివరాలు 

బైసరన్ పర్యవేక్షణ ఎవరిది? 

బైసరన్ వ్యాలీపై పర్యవేక్షణ బాధ్యత పహల్గాం డెవలప్‌మెంట్ అథారిటీ (PDA)అధీనంలో ఉంది. ఈ అథారిటీ పహల్గాంలోని ఇతర పర్యాటక ప్రదేశాలను కూడా చూసుకుంటుంది.ఈ అథారిటీకి చెందిన ముగ్గురు ప్రతినిధులతో ప్రముఖ మీడియా మాట్లాడింది. వారు బైసరన్ పార్క్ నిర్వహణ తమ శాఖలోనే ఉందని స్పష్టం చేశారు. అంతేకాక,బెతాబ్ వ్యాలీ సహా పలు చిన్న,పెద్ద పార్కుల నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని కూడా వివరించారు. ఈ ఒప్పందం మూడేళ్ల కాలపరిమితితో ఉంటుంది.గత ఏడాది,బైసరన్ పార్క్ నిర్వహణను మూడేళ్లకు రూ.3 కోట్లకు ఒక ప్రైవేట్ సంస్థకు కేటాయించారని, ఒక మాజీ ఉద్యోగి తెలిపారు. అయితే, ఆయన తన పేరును వెల్లడించొద్దన్నారు. ప్రముఖ మీడియా ఆ ప్రైవేట్ కాంట్రాక్టర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా,వారి నుండి స్పందన లేదు.

వివరాలు 

ఎప్పుడు తెరుస్తారు, ఎప్పుడు మూసేస్తారు? 

PDAకి చెందిన ఓ అధికారి ప్రకారం,బైసరన్ వ్యాలీ (బెతాబ్ వ్యాలీతో పాటు)సంవత్సరాంతం తెరిచే ఉంటుంది. కేవలం వాతావరణ ప్రతికూలంగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని రోజులు మూసివేస్తారు. ఉదాహరణకు,కశ్మీర్‌లో భారీగా మంచు కురిసే సమయంలో అక్కడి ప్రజలే బయటకు రాకపోవడంతో పర్యాటకుల రాకపోకలు సహజంగానే తగ్గుతాయి. అధికారుల ప్రకారం,పార్క్ తెరిచే విషయమై భద్రతా సంస్థల నుంచి ఎప్పుడూ ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదని తెలిపారు. బైసరన్ తెరవాలా,మూసేయాలా అనే నిర్ణయం స్వతంత్రంగానే తీసుకుంటామని చెప్పారు. గత ఏడాది అమర్‌నాథ్ యాత్ర సమయంలో రెండు నెలల పాటు పార్క్ మూసినట్లు వారు గుర్తు చేశారు. అయితే అప్పటికీ భద్రతా సంస్థలతో ఎటువంటి చర్చలు జరగలేదని తెలిపారు.

వివరాలు 

 భద్రతా క్లియరెన్స్ కోరిన సందర్భం 

ఒక అధికారి మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలలో బైసరన్ తెరచే విషయంలో పోలీసుల నుంచి ఎలాంటి సంప్రదింపులు జరగలేదని చెప్పారు. ఇది సున్నితమైన అంశమని, తాము మరింత వ్యాఖ్య చేయలేమని తెలిపారు. బైసరన్ తెరిచేందుకు తమ శాఖ అనుమతి ఇవ్వలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి స్పష్టం చేశారు. అయిదేళ్ల క్రితం,ఏడాది క్రితం అనంత్‌నాగ్‌లో పనిచేసిన ఈ అధికారి ప్రకారం, తన పదవీకాలంలో బైసరన్ పార్క్ ఓపెన్ చేయడం కోసం భద్రతా క్లియరెన్స్ కోరిన సందర్భం లేదు.

వివరాలు 

పోనీ స్టాండ్ సభ్యులు ఏం చెప్పారంటే.. 

పహల్గాంలోని పోనీ స్టాండ్ నంబర్ వన్ అధ్యక్షుడు బషీర్ అహ్మద్ వానీ మాట్లాడుతూ, దాడి జరిగిన రోజున తమ స్టాండ్‌ నుంచి 10 గుర్రాలు పర్యాటకులను బైసరన్‌కు తీసుకెళ్లాయని తెలిపారు. ఈ లోయ ఎప్పుడూ తెరిచేేనే ఉంటుందని, 2024లో అమర్‌నాథ్ యాత్ర సమయంలో మాత్రమే రెండు నెలల పాటు మూసినట్లు గుర్తు చేశారు. బషీర్ అహ్మద్ తండ్రి కూడా గుర్రాలపై పర్యాటకులను తీసుకెళ్లేవారని చెప్పారు. పహల్గాంలో మొదట్లో రెండు మాత్రమే సైట్‌ సీన్‌లు ఉండేవని..అవి శికార్‌గా, బైసరన్. శికార్‌గా వరకూ రోడ్డు వేయడంతో అక్కడ గుర్రపు రాకపోకలు తగ్గిపోయాయని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బైసరన్‌తో పాటు పహల్గాంలో కనీసం ఏడుసైట్‌ సీన్‌లు ఉన్నాయి.

వివరాలు 

ట్రెక్కింగ్ మార్గాలు, భయం 

బైసరన్‌కు వెళ్లేందుకు రెండు మార్గాలున్నాయని, వాటిలో ఒకటి మూడు కిలోమీటర్లదైతే, మరొకటి ఆరు కిలోమీటర్లదని చెప్పారు. ఒకదాన్ని హిల్ పార్క్, మరొకదాన్ని సీఎం బేస్ రోడ్ అని పిలుస్తారు. ఏప్రిల్ 22 దాడికి ముందు తీసిన ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నప్పటికీ వాటిని బయటపెట్టేందుకు భయపడుతున్నట్లు గుర్రపు స్వారీ సంఘం సభ్యులొకరు పేర్కొన్నారు. పరిస్థితి సాధారణంగా మారితే వాటిని చూపించగలమని అన్నారు.

వివరాలు 

భద్రతా అనుమతుల అంశం 

ఈ దాడి తర్వాత నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో, బైసరన్ తెరిచేందుకు భద్రతా అనుమతి తీసుకోలేదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపినట్లు కొన్ని మీడియా నివేదికలు వెల్లడించాయి. స్థానికుల అభిప్రాయం బైసరన్ ఎప్పుడైనా మూసివేశారా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం పహల్గాంలో కనీసం పది మంది స్థానికులతో ప్రముఖ మీడియా మాట్లాడింది. పార్క్ మూసిన దృశ్యం తాము ఎప్పుడూ చూడలేదని తెలిపారు. ఒకరు మాత్రం 2024లో అమర్‌నాథ్ యాత్ర సమయంలో రెండు నెలల పాటు మాత్రమే మూసారని చెప్పారు. ఆ సమయంలో భద్రతా బలగాలను కూడా మోహరించినట్లు తెలిపారు.

వివరాలు 

బైసరన్ వ్యాలీ వివరాలు 

పహల్గాం బజార్ నుంచి బైసరన్‌కు వెళ్లే మార్గం కొండల మధ్య గుండా సాగుతుంది. ఈ లోయకు కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే వెళ్లగలుగుతారు.బైసరన్ సముద్రమట్టానికి సుమారు 8,000అడుగుల ఎత్తులో ఉంది. చుట్టూ దట్టమైన అడవులు ఉండే ఈ ప్రాంతాన్ని "మినీ స్విట్జర్లాండ్" అని కూడా పిలుస్తారు. పార్క్‌లోకి ప్రవేశించాలంటే టికెట్ అవసరం.పెద్దలకు రూ.35,పిల్లలకు రూ.20 చొప్పున వసూలు చేస్తారు. పహల్గాం,దక్షిణకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉంది.ఇది శ్రీనగర్‌కు సుమారు 100కి.మీ దూరంలో ఉంది. బైసరన్,పహల్గాం ప్రాంతాలు పలుచోట్ల బాలీవుడ్ సినిమాల చిత్రీకరణకు వేదికయ్యాయి. అలాగే,ఈప్రాంతం అమర్‌నాథ్ యాత్ర బేస్‌క్యాంప్‌ అయిన నున్వాన్‌కు ప్రాముఖ్యత కలిగిన మార్గం. యాత్ర సమయంలో గుహ వరకూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి.ఎత్తైన పర్వతాల్లో కూడా సాయుధ బలగాలను మోహరిస్తారు.