NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి?
    గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి?

    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 13, 2025
    05:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ వ్యాపార కూడలిలో మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో ఉన్న స్తూపం చాలామందిని ఆశ్చర్యంలో పడేస్తుంది.

    ఎందుకంటే ఆయన పాకిస్థాన్‌కు జాతిపితగా గుర్తింపు పొందినవారు. అయితే, ఈ టవర్ గుంటూరులో ఒక ప్రసిద్ధ సెంటర్‌గా నిలిచిపోయింది.

    ఏడు దశాబ్దాలు గడిచినా, జిన్నా టవర్ గుంటూరులో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.

    గుంటూరు ముస్లింల వ్యాపార సముదాయమైన మాయాబజార్‌కు లాల్ బహదూర్ శాస్త్రి పేరు ఉండగా, ముస్లిమేతరులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జిన్నా పేరుతో టవర్ ఉండటం విశేషమని కొందరు అభిప్రాయపడుతున్నారు.

    నేపథ్యం

    జిన్నా పేరుతో టవర్ ఎందుకు? దాని నేపథ్యం ఏమిటి? 

    భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ముందే ఈ నేపథ్యం మొదలైంది.జిన్నా వృత్తిరీత్యా న్యాయవాదిగా పనిచేశారు.

    తొలుత కాంగ్రెస్ నేతృత్వంలోని స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నా,తరువాత ముస్లిం లీగ్‌ను స్థాపించి ప్రత్యేక దేశం కోసం పోరాడారు.

    లండన్‌లో కొంతకాలం ఉన్న జిన్నా,1934లో భారత్‌కు తిరిగి వచ్చారు. 1942 నాటికి గుంటూరు ప్రాంతానికి చెందిన లాల్ జాన్ బాషా (తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేత లాల్ బాషా తాత) ఎమ్మెల్యేగా పనిచేశారు.

    ఆయన ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీలో రెండుసార్లు ప్రజాప్రతినిధిగా సేవలందించారు.

    ఆయన పేరుతోనే ఇప్పుడు లాలాపేట అనే ప్రదేశం ఉంది. ఆ కాలంలో, క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకున్న సమయంలో, లాల్ జాన్ బాషా, మొహమ్మద్ అలీ జిన్నాతో గుంటూరులో సభలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.

    వివరాలు 

    జిన్నా పేరుతో టవర్ ఎందుకు? దాని నేపథ్యం ఏమిటి? 

    ఇందుకోసం గుంటూరు నుండి కొందరు ప్రతినిధులు బొంబాయి వెళ్లి జిన్నాను ఆహ్వానించారు.

    ఆయన ఆహ్వానాన్ని స్వీకరించడంతో గుంటూరులో భారీ ఏర్పాట్లు జరిగాయి. జిన్నా రాక కోసం భారీ సన్నాహాలు జరిగినా, చివరి నిమిషంలో ఆయన రాలేకపోతున్నట్లు సమాచారం ఇచ్చారు.

    ఆయనకు బదులుగా, ఆయనకు సన్నిహితుడైన లియాఖత్ అలీఖాన్ సభకు హాజరయ్యారు.

    ఈ సభలో స్వాతంత్ర్య యోధులు కొండా వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, కల్లూరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

    టవర్ 

    జిన్నా గౌరవార్థం నిర్మించిన టవర్ 

    జిన్నా గుంటూరుకు రాకపోయినప్పటికీ, ఆయన గౌరవార్థంగా ఈ టవర్‌ను నిర్మించినట్టు లాల్ జాన్ బాషా కుటుంబసభ్యులు వెల్లడించారు.

    గుంటూరు మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ ప్రకారం, "1941 ప్రాంతంలో సత్తెనపల్లి దగ్గర హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. మా తాతగారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మత సామరస్యానికి ప్రయత్నించారు. జిన్నా సహకారం తీసుకుని, జీవిత ఖైదు విధించబడిన 14 మందిని బొంబాయిలోని హైకోర్టు ద్వారా విముక్తి పొందేలా చేశారు. జిన్నా గుంటూరు రానున్నారన్న సమాచారం వచ్చినప్పుడు, ఆయన గౌరవార్థంగా టవర్ నిర్మించాలని నిర్ణయించారు."

    జియావుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం, 1942 నుంచి 1945 మధ్య టవర్ నిర్మాణం కొనసాగింది. 1945లో పూర్తయిన తర్వాత, ఈ ప్రాంతం 'జిన్నా టవర్ సెంటర్'గా పేరుగాంచింది.

     పేరు మార్పు 

    జిన్నా పేరుతో ఉన్న టవర్‌ పేరు మార్చాలన్న డిమాండ్లు 

    ఈ టవర్ పాక్ వ్యవస్థాపకుడు పేరుతో ఉండటం వల్ల, కొన్ని సందర్భాల్లో పేరు మార్చాలన్న డిమాండ్లు వినిపించాయి.

    దేశ విభజనకు కారకుడైన నేత పేరును కొనసాగించరాదన్న అభిప్రాయాలు వచ్చినట్టు స్థానికులు తెలిపారు.

    అయితే, గుంటూరులో ముస్లింల జనాభా ఎక్కువగానే ఉన్నా, హిందూ-ముస్లింల ఐక్యతకు ఎప్పుడూ పెద్దగా సమస్య రాలేదని వారు చెబుతున్నారు.

    "నగరంలో ముస్లిం ప్రముఖుల పేర్లతో వీధులు, ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందులో భాగంగా జిన్నా టవర్ కూడా ఉంది. కార్గిల్ యుద్ధం సమయంలో ఈ టవర్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. మత సామరస్యానికి ఇది ఓ చిహ్నంగా ఉంది" అని స్థానిక లెక్చరర్ ఎం.సురేశ్‌బాబు అన్నారు.

    వివరాలు 

    పాకిస్తాన్ వర్గాల్లోనూ ఆశ్చర్యం 

    ఈ విషయం పాకిస్తానీ వర్గాలను కూడా ఆశ్చర్యంలో ముంచిందని ముస్లిం జేఏసీ నేత మహ్మద్ కలీం తెలిపారు.

    "ముషారఫ్ హయంలో గుంటూరు జిన్నా టవర్‌పై పాకిస్తాన్ హైకమిషనర్ ఆసక్తి చూపారు. అప్పట్లో ఎంపీగా ఉన్న లాల్ జాన్ బాషా టవర్ ఫోటోలను వారికి పంపించారు. వాటిని చూసిన వారు లౌకికవాద దేశంలో ఇలా మత సామరస్యానికి గుర్తుగా జిన్నా పేరుతో స్మారకం ఉండటం గొప్ప విషయమని అభినందించారు" అని ఆయన వివరించారు.

    జిన్నా దేశ విభజనకు ముందు స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వామిగా ఉన్నారు కనుక, ఆయన పేరును గుర్తిస్తూ ఈ టవర్ ఇప్పటికీ నిలుస్తోందని కలీం తెలిపారు.

    వివరాలు 

    నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి 

    ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జిన్నా టవర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

    వాటర్ ఫౌంటెన్, గార్డెన్, లైటింగ్ లాంటి వసతులు అందిస్తున్నారు. సుమారు 7 లక్షల జనాభా గల గుంటూరులో, దాదాపు 20 శాతం ముస్లింలు నివసిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో, మొహమ్మద్ అలీ జిన్నా పేరుతో నిర్మించిన ఈ టవర్ నగరంలో ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా మారినదే కాదు, మత సౌభ్రాతృత్వానికి స్మారకంగా కూడా నిలిచింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు జిల్లా

    తాజా

    Jinnah Tower: గుంటూరులో పాకిస్తాన్ వ్యవస్థాపకుడి పేరుతో స్తూపం ఎందుకు ఉంది? దాని చరిత్ర ఏమిటి? గుంటూరు జిల్లా
    Weather Update: తెలంగాణలో భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు తెలంగాణ
    Boycott Turkey: ఉద్రిక్తతల నడుమ ఉధృతమైన 'బాయ్‌కాట్ తుర్కియే'  నిరసనలు !  బాయ్‌కాట్ తుర్కియే
    Bangladesh: బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం.. దేశం విడిచివెళ్లిపోయిన మాజీ అధ్యక్షుడు బంగ్లాదేశ్

    గుంటూరు జిల్లా

    గుంటూరు: ఇప్పటంలో ఆక్రమణల పేరుతో కూల్చివేతలు; గ్రామస్థుల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్
    గుంటూరు; రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు  రోడ్డు ప్రమాదం
    గుంటూరు: విట్ యూనివర్సిటీలో విద్యార్థుల డిష్యుం డిష్యుం.. వార్నింగ్ ఇచ్చి పంపిన పోలీసులు ఆంధ్రప్రదేశ్
    టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025