కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల రావడాన్ని ఆహ్వానిస్తున్నాం : మాజీ ఎంపీ కేవీపీ
వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు, ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఈ మేరకు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఏపీలోని విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు వచ్చిన కేవీపీ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వాదిగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ఏపీలో పార్టీ బలం పుంజుకునేందుకు రాహుల్గాంధీకి రాష్ట్ర రాజకీయ పరిణామాలను, పరిస్థితులను వివరిస్తామన్నారు. కాగా దివంగత సీఎం వైఎస్సాఆర్ కు అంతరంగికుడిగా కేవీపీ పేరు గడించారు.
2024లో ఏపీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం : కేవీపీ
షర్మిల, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాక, పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలను షర్మిల నిర్వర్తించనున్నారని కేవీపీ వెల్లడించారు. ఏపీలో పునర్వైభవం కోసం రాహుల్ గాంధీ సూచనలను అమలు చేస్తామన్నారు. తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు. 2024 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2018లో తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు వల్లే కాంగ్రెస్ పార్టీ ఘోరంగా నష్టపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఇటుక ఇటుక పేర్చుకుంటూ మళ్లీ పునరుత్తేజం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా వైసీపీ, టీడీపిలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏపీకి చేస్తున్న అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.