
Char dham yatra:చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. గంగోత్రి, యమునోత్రి పోర్టల్స్ ఓపెన్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్లో బుధవారం అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని పవిత్ర చార్ధామ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఉత్తర్కాశీ జిల్లాలో గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల కోసం తెరిచారు. ఈ పవిత్ర ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సనాతన ధర్మం, భక్తి, విశ్వాసం,ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక కేదార్నాథ్ ధామ్ ఆలయం శుక్రవారం, బద్రీనాథ్ ఆలయం ఆదివారం భక్తులకు తెరుచుకోనుంది.
వివరాలు
భైరవఘాటిని విడిచి గంగోత్రి ధామ్కు..
గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరవడం ద్వారా ఉత్తరకాశి జిల్లాలో చార్ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ముక్బా గ్రామం నుండి గంగాదేవి పల్లకీని ఆరు నెలల శీతాకాల విరామం అనంతరం మంగళవారం గంగోత్రి ధామ్కు తీసుకువచ్చారు. గత రాత్రి భైరవఘాటిలో ఉన్న భైరవ ఆలయంలో విశ్రాంతి కోసం పల్లకీని నిలిపారు. ఈరోజు ఉదయం పల్లకీ భైరవఘాటిని విడిచి గంగోత్రి ధామ్కు చేరుకుంటుంది. అక్కడ ఉదయం 10:30 గంటలకు సంప్రదాయ పద్ధతుల్లో వేద మంత్రాల మధ్య ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నట్లు తీర్థ పురోహిత్ రాజేష్ సెమ్వాల్ తెలిపారు.
వివరాలు
ఆదివారం నాడు బద్రీనాథ్ ఆలయ దర్శనం
ఇదిలా ఉంటే, యమునాదేవి పల్లకీ ఈ ఉదయం ఖర్సాలిలోని తన శీతాకాల నివాసం నుండి యమునోత్రి ధామ్ వైపు ప్రయాణం ప్రారంభించింది. అక్కడ ఆలయ ద్వారాలు భక్తుల సందర్శనార్థం ఉదయం 11:55 గంటలకు తెరవబడనున్నాయి. ఇక శుక్రవారం నాడు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు భక్తులకు అందుబాటులోకి రానుండగా, ఆదివారం నాడు బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనానిస్తుందనే విషయం తెలిసిందే.