
TAMARIND SEEDS: కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు ఔషధంగా చింత గింజల పొడి.. కోట్లలో వ్యాపారం - పొడికి భారీగా డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
చింతగింజలకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు .
అవును ఈ చిన్న గింజలకు గిరాకీ ఎంతగా ఉందో తెలుసా. ఈ వ్యాసం పూర్తిగా చదివితే మీకు మొత్తం సమాచారం స్పష్టమవుతుంది.
ధరలు రూ.40 నుంచి రూ.44 వరకూ:
చింతగింజల పొడి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులకు ఓ గొప్ప ఔషధంగా పనిచేస్తోంది.
అంతే కాదు, పొరుగు దేశాల్లోని ఫార్మా కంపెనీలు, రంగుల తయారీ సంస్థలు, అలాగే పట్టువస్త్రాల తయారీలో కూడా ఈ పొడిని విస్తృతంగా వాడుతున్నారు.
కోట్ల రూపాయల వ్యాపారం సాగే ఈ రంగం వేలాది మందికి ఉపాధిని కల్పిస్తోంది. దక్షిణ భారతదేశంలో పేరొందిన వ్యాపారాల్లో చింతగింజల వ్యాపారం ప్రముఖమైనది.
వివరాలు
పుంగనూరు, హిందూపురం ప్రాంతాల్లో వ్యాపారం
ఇవి ఏడాది పొడవునా డిమాండ్ ఉన్నప్పటికీ, విక్రయించే వారు మాత్రం తక్కువగా ఉంటున్నారు.
తాజాగా చింతపండు ధరలు పెరుగుతుండటంతో గింజల ధరలు కూడా పెరుగుతున్నాయి.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ వ్యాపారం ప్రధానంగా పుంగనూరు, హిందూపురం ప్రాంతాల్లో జరగుతోంది.
గతంలో చింతగింజల ధర కిలోకు రూ.30 నుంచి రూ.35 మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఈ ధర రూ.40 నుంచి రూ.44 వరకూ చేరింది.
వివరాలు
మందుల తయారీలో కీలక పాత్ర:
తమిళనాడు,కేరళ,కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చింతగింజలను సేకరించి,పుంగనూరులో వాటి పై పొట్టు తీసే పనిని చేపడతారు.
ఈ ప్రక్రియకు అవసరమైన యంత్రాలు ఎక్కువగా పుంగనూరులోనే ఉన్నాయి.
ఈ గింజలు అక్కడ ప్రాసెస్ అయి హిందూపురం,మధురై, గుజరాత్లోని సూరత్, అహ్మదాబాద్, వాపి, అలాగే చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని మిషన్లకు చేరతాయి.
అక్కడ వీటి పొడిని తయారుచేస్తారు. ప్రస్తుతం పుంగనూరులోనే 12 యంత్రాల ద్వారా రోజుకు సుమారు 200 టన్నుల చింతగింజలను (పొట్టు తీసినవిగా) ప్రాసెస్ చేసి పంపుతున్నారు.
ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఈ పొడిని మందుల తయారీలో ఉపయోగిస్తుండగా, ఇతర పరిశ్రమలు — రంగులు, పట్టువస్త్రాల్లో గంజి, మస్కట్ కాయిల్స్, పేపర్, ఫ్లైవుడ్, ప్లాస్టిక్ వస్తువులు, జూట్ పరిశ్రమ వంటి విభిన్న రంగాల్లో దీన్ని వినియోగిస్తున్నాయి.