
Healthy Food: వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవాలంటే. ఒంటికి చలువ చేసే ఆహారం తినాలి
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలం వచ్చిందంటే మనమంతా సాధారణంగా కాటన్ దుస్తులు ధరించడం, గొడుగు వెంట తీసుకెళ్లడం, చర్మానికి సన్స్క్రీన్లు పూయడం,పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటివి చేస్తుంటాం.
కానీ, ఈ వేడి కాలంలో శరీర ఉష్ణోగ్రతను సునియంత్రణలో ఉంచేందుకు శీతలతనిచ్చే ఆహారం కూడా ఎంతో అవసరం.
మరి వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తినాలి? ఏవాటిని నివారించాలి? చూద్దాం!
వివరాలు
భానుడి ప్రతాపం పెరుగుతోంది
ఇప్పుడు ఉష్ణోగ్రతలు రోజూ 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఈ అధిక ఉష్ణోగ్రతల వలన శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు పోవడం వల్ల దాహం, నీరసం, అలసట వెంటాడతాయి.
వాటి కారణంగా డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువ. ముఖ్యంగా మధుమేహం, హై బీపీ, ఇతర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో ఆహారపు అలవాట్లను సరిచేసుకోవడం అత్యవసరం. ఎందుకంటే శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.
వివరాలు
పోషకాల సమతుల్యతకు ప్రాధాన్యత
తగిన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవచ్చు.
ఈ క్రమంలో నీరసం, అలసట వంటి సమస్యలు తగ్గుతాయి. ఎండలో ఎక్కువగా బయట తిరిగే వారు సరైన ఆహారం తీసుకోకపోతే వేడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల సాధారణ కాలంతో పోలిస్తే వేసవిలో ఆహారపు అలవాట్లు కొంత భిన్నంగా ఉండాల్సిన అవసరం ఉంది.
మసాలా పదార్థాలు, ఎక్కువ నూనె ఉపయోగించే వంటలు, వేపుళ్ళు, ఎక్కువ ఉప్పు ఉండే పచ్చళ్లు, అప్పడాలు తక్కువగా తీసుకోవాలి.
ఎందుకంటే సోడియం అధికంగా తీసుకుంటే శరీరం మూత్రం ద్వారా దాన్ని బయటకు పంపుతుందట. ఇది డీహైడ్రేషన్కు దారి తీస్తుంది.
వివరాలు
వేడి కాలానికి అనుకూలమైన ఆహారాలు
ఎండ తీవ్రత పెరిగే ఈ కాలంలో నీరు ఎక్కువగా పోయే పరిస్థితి ఉంటుంది. అందువల్ల శరీరానికి తగిన విటమిన్లు, మినరల్స్ అందించే పండ్లు, ఆహార పదార్థాలు తినడం అవసరం.
మామిడి: ఇందులో విటమిన్ సి, ఏ, బి6, పీచు అధికంగా ఉండటం వలన శరీరానికి తగినంత హైడ్రేషన్ లభిస్తుంది.
పుచ్చకాయ: దాదాపు 90 శాతం నీటితో ఉండే పండు ఇది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
పుదీనా జ్యూస్: జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది.
బొప్పాయి: శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో తోడ్పడుతుంది. ఇందులోని పీచు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
వివరాలు
వేడి కాలానికి అనుకూలమైన ఆహారాలు
సబ్జా గింజలు: నీటిలో నానబెట్టి తాగితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, పీచు లభిస్తాయి.
ఆరెంజ్ రకం పండ్లు: నీటి శాతం ఎక్కువగా ఉండటం, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. చర్మాన్ని రక్షిస్తాయి.
పెరుగు, మజ్జిగ: వేసవిలో తప్పనిసరిగా ఉండాల్సినవి. ప్రొబయోటిక్స్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. లస్సీ రూపంలో పిల్లలు సైతం ఇష్టంగా తీసుకుంటారు.
కీరదోసకాయ: 95 శాతం నీటితో ఉండే కూరగాయ ఇది. విటమిన్ కె, బి6 వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. సలాడ్లా తినడం లేదా మజ్జిగతో కలిపి తీసుకోవడం మంచిది.
కొబ్బరి నీళ్లు: శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందించడంతో పాటు, పొటాషియం, మెగ్నీషియం వల్ల శక్తివంతంగా ఉంచుతాయి.
వివరాలు
రోజులో మూడు పూటల ఆహారం ఎలా ఉండాలి?
ఉదయం అల్పాహారం
వేడి కాలంలో ఉదయం అల్పాహారం తేలికగా జీర్ణమయ్యేలా ఉండాలి. రాగి లేదా మినప ఇడ్లీలు, కూరగాయల ఉప్మా, చిరుధాన్యాల ఉప్మా వంటి వాటిని తీసుకోవచ్చు.
చివరగా మజ్జిగ తాగితే ఎండలోకెళ్లినా శరీరంలో నీటి శాతం తక్కువ కాకుండా ఉంటుంది. ఉదయం 10-11 మధ్యలో ఒక పండు తీసుకోవడం మేలు చేస్తుంది.
మధ్యాహ్న భోజనం
అన్నం, లేదా లెమన్ రైస్, కొత్తమీర రైస్, పాలక్ రైస్, పుదీనా రైస్ వంటి తేలికపాటి భోజనం తీసుకోవాలి.
ప్రోటీన్ల కోసం చికెన్, గుడ్లు తినొచ్చు. అయితే మసాలాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. చివరగా పెరుగు అన్నం లేదా మజ్జిగ తీసుకోవడం మంచిది.
వివరాలు
సాయంత్రం - రాత్రి భోజనం
భోజనం తేలికగా ఉండాలి. చపాతీ, అన్నం, ఆకు కూరలు, కూరగాయలు, పెరుగు లేదా మజ్జిగ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి.
మద్యపానాన్ని పూర్తిగా నివారించాలి. ఎందుకంటే మద్యపానం శరీరాన్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది.