
Axiom-4 mission:జూలై 14న భూమి మీదకు తిరిగి రానున్నశుభాంశు శుక్లా
ఈ వార్తాకథనం ఏంటి
ఆక్సియం-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరిన భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మిగతా ముగ్గురు అస్ట్రోనాట్లు జూలై 14న భూమి వైపు పునరాగమనం చేయనున్నారు అని నాసా అధికారికంగా ప్రకటించింది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఆక్సియం-4 మిషన్ పురోగతిని సమగ్రంగా పరిశీలిస్తుండగా, వీరిని జూలై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి విడదీయాలని (అన్డాక్) యోచిస్తున్నామని పేర్కొన్నారు.
వివరాలు
ఈ నెల 10న భూమిపైకి రావాల్సి ఉన్న వ్యోమగాములు..
ఇక ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25న నాసా ఆక్సియం-4 మిషన్ ప్రయోగం చేసింది. ప్రయోగం తర్వాత మరుసటి రోజు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా చేరుకున్నారు. అప్పటి నుంచి శుభాన్షు శుక్లా,మిగతా సభ్యులు ఐఎస్ఎస్లో పలు పరిశోధనలు, ప్రయోగాలపై పని చేస్తున్నారు. మొదట వీరు జూలై 10న భూమికి తిరిగిరావాల్సి ఉన్నప్పటికీ, తాజా అప్డేట్ ప్రకారం వారి రాకను జూలై 14వ తేదీకి మారినట్టు నాసా స్పష్టం చేసింది. భూమిపైకి రాగానే వ్యోమగాములు వైద్య బృందాల పర్యవేక్షణలో ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.