Page Loader
Shubhanshu Shukla: 'చిన్నపిల్లాడిలా నడవడం నేర్చుకుంటున్నా'.. అంతరిక్షం నుంచి లైవ్ కాల్‌
'చిన్నపిల్లాడిలా నడవడం నేర్చుకుంటున్నా'.. అంతరిక్షం నుంచి లైవ్ కాల్‌

Shubhanshu Shukla: 'చిన్నపిల్లాడిలా నడవడం నేర్చుకుంటున్నా'.. అంతరిక్షం నుంచి లైవ్ కాల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2025
12:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్‌, మన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) కోట్లాది మంది భారతీయుల ఆశల్ని మోస్తూ అంతరిక్ష ప్రయాణం చేపట్టారు. ప్రస్తుతం భూమిని చుట్టేస్తున్న వ్యోమనౌకలో ఉన్న ఆయన, అంతరిక్షం నుంచి ప్రత్యక్షంగా (లైవ్ కాల్‌ ద్వారా) సందేశాన్ని అందించారు. ఈ యాత్ర అద్భుతంగా కొనసాగుతోందని చెప్పారు. భార రహిత వాతావరణంలో కదలడం, నడవడం వంటి అంశాలను ఒక చిన్నపిల్లవాడిలా బేసిక్‌గా నేర్చుకుంటున్నానన్నారు.

వివరాలు 

ప్రయాణంలో చిన్న హంస బొమ్మ

"అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. సహవ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం. 30 రోజుల క్వారంటైన్ అనంతరం మేము అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని (ISS) చేరుకోబోతున్నాం. ఈ యాత్రలో నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాతో కలిసి ఒక చిన్న హంస బొమ్మ (జాయ్) కూడా ఈ ప్రయాణంలో భాగమైంది. భారతీయ సంస్కృతిలో హంసను జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు" అంటూ శుక్లా తన భావాలను వ్యక్తపరిచారు.

వివరాలు 

నా అనుభవాలను మీతో పంచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా:శుభాంశు శుక్లా

"ఇప్పుడిప్పుడే నేనూ భారరహిత స్థితిలో నడవడం,తినడం వంటి విషయాల్లో అలవాటు పడుతున్నాను.ఇవన్నీ చిన్నపిల్లాడిలా కొత్తగా నేర్చుకుంటున్నాను. ఇక్కడ గడిపే ప్రతి క్షణం నాకు అమూల్యంగా మారుతోంది. నా భుజంపై త్రివర్ణ పతాకం ఉన్నపుడే ఒక ప్రత్యేక భావన కలుగుతోంది - ఈ ప్రయాణంలో నేనొక్కడినే కాదు.. కోట్లాది మంది భారతీయుల ఆశయాలూ,ఆశీర్వాదాలూ నాతో కలిసి ఉన్నాయన్న నమ్మకముంది.రోదసిలో నేను వేసిన అడుగు చిన్నదిగా ఉండొచ్చు,కానీ ఇది భారత మానవ సహిత అంతరిక్ష యాత్రకు గొప్ప తొలి ముందడుగుగా నిలుస్తుంది.ఐఎస్‌ఎస్‌లో అందుబాటులో ఉన్నంత ఎక్కువ సమయం గడపాలని నా ఉద్దేశం.నా అనుభవాలను మీతో పంచుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని అన్నారు శుభాంశు శుక్లా. ఈ లైవ్‌కాల్ సుమారు 15 నిమిషాల పాటు కొనసాగింది.

వివరాలు 

41 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు 

భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం-4 మిషన్‌ ద్వారా శుభాంశుతో పాటు మొత్తం నలుగురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం 4:30 గంటల సమయంలో వారి వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది. ఈ బృందం రెండు వారాలపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నివసిస్తూ వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనుంది. దాదాపు 41 సంవత్సరాల తర్వాత మరో భారతీయుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టడం ఇదే ప్రథమం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అంతరిక్షం నుంచి ప్రత్యక్షంగా