Nobel Prize in Physics 2024: భౌతికశాస్త్రంలో జాన్ జె.హోప్ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్లకు నోబెల్ పురస్కారం
భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది నోబెల్ బహుమతి ఇద్దరు శాస్త్రవేత్తలకు లభించింది. జాన్ జె.హోప్ఫీల్డ్, జెఫ్రీ ఈ.హింటన్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ అభివృద్ధి చేసినందుకు ఈ ప్రఖ్యాతి చెందిన పురస్కారం వారికి దక్కింది. కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్లోని నోబెల్ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది. గతేడాది (2023) భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి ముగ్గురికి ఇచ్చారు. పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలను అధ్యయనం చేసిన ఫ్రాన్స్ శాస్త్రవేత్త పియర్ అగోస్తి, హంగేరియన్ వలసవాదిగా ఉన్న ఫెరెంక్ క్రౌజ్, ఫ్రాన్స్-స్వీడన్ శాస్త్రవేత్త యాన్ ఎల్ హ్యులియర్ లు ఆ పురస్కారం పొందారు. 1901 నుంచి ఇప్పటివరకు 117 సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతులు ప్రకటించబడ్డాయి.
నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14వరకు..
వైద్య విభాగంలో నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగుతుందని తెలియజేశారు. సోమవారం వైద్య శాస్త్రంలో విజేతలను ప్రకటించిన అనంతరం, నేడు భౌతికశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను వెల్లడించారు. బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2024) ప్రకటించబడుతుంది, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లు వెల్లడిస్తారు.
1901 నుంచి ట్రస్ట్ ద్వారా ఈ అవార్డుల ప్రదానం
స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన తరువాత, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 10 లక్షల డాలర్లు) నగదు అందజేయబడుతుంది. డిసెంబర్ 10న జరిగే కార్యక్రమంలో అవార్డు గ్రహీతలకు అవార్డులు అందజేస్తారు.