Page Loader
Sunita wiiliams: మరోసారి స్టార్ లైనర్ లోనే ఐఎస్‌ఎస్‌కు: సునీతా విల్లియమ్స్ 
మరోసారి స్టార్ లైనర్ లోనే ఐఎస్‌ఎస్‌కు: సునీతా విల్లియమ్స్

Sunita wiiliams: మరోసారి స్టార్ లైనర్ లోనే ఐఎస్‌ఎస్‌కు: సునీతా విల్లియమ్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ మూలాలు కలిగిన సునీతా విలియమ్స్‌ ,మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌లు దాదాపు తొమ్మిది నెలల తర్వాత, మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)నుండి స్పేస్‌-X (SpaceX) సంస్థకు చెందిన డ్రాగన్‌ క్యాప్సూల్‌ ద్వారా భూమిపై సురక్షితంగా చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. భూమిని చేరుకున్న వెంటనే నాసా బృందం వీరందరినీ హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించింది. 12 రోజుల తర్వాత మొదటిసారి బాహ్య ప్రపంచం ముందుకు వచ్చారు. ఈసందర్భంగా నాసా నిర్వహించిన మీడియా సమావేశంలో సునీతా, బుచ్ విల్మోర్‌, నిక్‌ హేగ్‌ ప్రసంగించారు. ఈ సమయంలో సునీతా మాట్లాడుతూ,ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

వివరాలు 

నాసా బృందాలకు సునీతా కృతజ్ఞతలు

మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ, అవకాశం లభిస్తే మళ్లీ స్టార్‌ లైనర్‌ ద్వారా ISS‌కు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సునీతా పేర్కొన్నారు. స్టార్‌ లైనర్‌ ఎంతో సమర్థవంతమైన వాహక నౌక అయినప్పటికీ, కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటంతో అవి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌ మాట్లాడుతూ, నాసా,బోయింగ్‌ సంస్థలు ఈ సాంకేతిక లోపాలను దూరం చేసేందుకు కట్టుబడి ఉన్నాయని తెలియజేశారు. తమ మిషన్‌ విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన నాసా బృందాలకు సునీతా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చేసిన శిక్షణ వల్లనే ISS ప్రయాణం విజయవంతమైందని, భూమికి తిరిగి వచ్చే ప్రక్రియలో మిషన్‌ కంట్రోల్‌ బృందాల సహాయం అమూల్యమైనదని చెప్పారు.

వివరాలు 

కోలుకునే ప్రక్రియలో నాసా బృందాలు అహర్నిశలూ కృషి

భూమికి వచ్చిన వెంటనే తాను ఇప్పటికే మూడు మైళ్లు పరుగెత్తినట్లు తెలిపారు. సాధారణ జీవనశైలికి తిరిగి వచ్చే మార్గంలో తమకు శిక్షణబృందాలు ఎంతగానో సహాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. అంతరిక్షంలో ఉన్నప్పుడు వారు అనేక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారని,ప్రత్యేక శిక్షణ పొందారని తెలియజేశారు. ISSలో ఉన్న సమయంలో తన ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారని సునీతా చెప్పారు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన తర్వాత శరీరంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని, వాటికి అనుగుణంగా శరీరం సరిపోనివిధంగా కొన్ని సర్దుబాట్లు అవసరమని పేర్కొన్నారు. అయితే కోలుకునే ప్రక్రియలో నాసా బృందాలు అహర్నిశలూ కృషి చేస్తున్నాయని తెలిపారు. భూమిపై అడుగుపెట్టినప్పటి నుంచి శక్తిని తిరిగి పొందేందుకు అనేక సహాయకచర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

వివరాలు 

స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ ద్వారా సునీతా, విల్మోర్‌లు భూమిపైకి అడుగు 

విల్మోర్ మాట్లాడుతూ,మానవ అంతరిక్షయానం అనేక దేశాలను ఒకే వేదికపైకి తీసుకువస్తుందని చెప్పారు. స్టార్‌ లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలను పరిష్కరించేందుకు నాసా,బోయింగ్‌ బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని కొనియాడారు. భూమిపై సురక్షితంగా తిరిగి చేరడంలో నాసా చేసిన కృషి ఎంతో విశేషమని తెలిపారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌక ద్వారా సునీతా,విల్మోర్‌లు ISS‌కు వెళ్లారు. వారి మిషన్‌ ప్రకారం 8 రోజుల్లో భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే,స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వారు మరికొంతకాలం ISS‌లోనే ఉండాల్సి వచ్చింది. కొన్ని వారాల తర్వాత స్టార్‌లైనర్‌ను వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి పంపించారు. చివరకు,అనేక ప్రయత్నాల అనంతరం స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ ద్వారా సునీతా, విల్మోర్‌లు భూమిపై సురక్షితంగా అడుగుపెట్టగలిగారు.