Page Loader
BCCI -Team India: కుటుంబసభ్యుల విషయంలో క్రికెటర్లకు ఊరట.. ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!
కుటుంబసభ్యుల విషయంలో క్రికెటర్లకు ఊరట.. ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!

BCCI -Team India: కుటుంబసభ్యుల విషయంలో క్రికెటర్లకు ఊరట.. ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
02:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాజయం తర్వాత, బీసీసీఐ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్‌కు కఠినమైన నిబంధనలను అమలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై క్రికెటర్లు తమ జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లడంపై సహా, కొన్ని సౌకర్యాల విషయంలో ఆంక్షలు విధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)కు కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయని బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఈ 'నో ఫ్యామిలీ రూల్' నుంచి ఆటగాళ్లకు కొంత ఉపశమనం లభించినట్లు తెలుస్తోంది. దుబాయ్‌కి వెళ్లే ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లుకోవచ్చని బోర్డు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇందుకు ఓ షరతు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

వివరాలు 

కేవలం 7 రోజులు మాత్రమే కుటుంబ సభ్యులతో..

ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌కు మాత్రమే ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతిస్తామని బీసీసీఐ స్పష్టం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లాలనే విషయంలో ఆటగాళ్లు అంతా చర్చించి, ఆ తర్వాత బోర్డుకు అభ్యర్థన చేయాలని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. దాని ప్రకారమే బోర్డు తగిన ఏర్పాట్లు చేయనుంది. బీసీసీఐ రూపొందించిన '10 పాయింట్ల' పాలసీ ప్రకారం, ఆటగాళ్లు ఒక నెల పాటు టూర్‌లో ఉంటే, కేవలం 7 రోజులు మాత్రమే కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనుమతి ఉంటుంది.

వివరాలు 

 మినహాయింపుపై స్పష్టత లేదు

అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభమై, మార్చి 9న ముగియనున్న నేపథ్యంలో, క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లేందుకు అవకాశం లేదని బీసీసీఐ ముందుగా స్పష్టం చేసింది. ఏదైనా సీనియర్ క్రికెటర్ ప్రత్యేక అనుమతి కోరినప్పటికీ, ఎలాంటి మినహాయింపు ఉండదని బోర్డు తేల్చిచెప్పింది. అయితే, తాజా పరిస్థితులను పరిశీలించిన బీసీసీఐ, ఒక్క మ్యాచ్‌కు ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను వెంట తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఏ మ్యాచ్‌కు ఈ మినహాయింపు వర్తిస్తుందనే విషయం ఇంకా స్పష్టత లేదు.

వివరాలు 

బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్

బుధవారం నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. టీమ్ ఇండియా ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదిక అయిన దుబాయ్‌లో జరగనున్నాయి. ఇప్పటికే భారత జట్టు అక్కడకు చేరుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.