Rohit Sharma: రోహిత్పై కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు.. స్పందించిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్ జట్టు కెప్టెన్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) గురించి కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన సోషల్ మీడియా పోస్టు పెద్ద దుమారాన్ని రేపింది.
రోహిత్ లావుగా ఉన్నాడని ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ విషయంపై తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కూడా స్పందించింది.
కీలక టోర్నమెంట్ సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని పేర్కొంది.
ఈ వివాదంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
వివరాలు
శమా మహమ్మద్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
"ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ నడుస్తున్న సమయంలో, బాధ్యతాయుతమైన వ్యక్తుల నుంచి ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు రావడం దురదృష్టకరం. ఇవి ఆటగాడిపై, అంతేకాదు, మొత్తం జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తిగత ప్రచార ప్రయోజనాల కోసం ఇలాంటి విమర్శలు చేయడం మానుకోవాలి," అని ఆయన ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థకు తెలిపారు.
శమా మహమ్మద్ ఎక్స్ (మాజీగా ట్విట్టర్) లో చేసిన పోస్టులో, "రోహిత్ శర్మ చాలా లావుగా ఉన్నాడు. అతడు బరువు తగ్గాల్సిన అవసరం ఉంది," అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
వివరాలు
తీవ్రస్థాయికి వివాదం
ఈ వివాదం తీవ్రస్థాయికి చేరినా, శమా మహమ్మద్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ, "నేను కేవలం ఆటగాళ్ల ఫిట్నెస్పై నా అభిప్రాయం వ్యక్తపరిచాను. ఇది బాడీ షేమింగ్ కాదూ. ఏ క్రీడాకారుడైనా ఫిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు రోహిత్ కొద్దిగా ఓవర్ వెయిట్గా ఉన్నట్లు అనిపించింది. అందుకే ఆ పోస్టు చేశాను. కానీ అనవసరంగా నాపై విమర్శలు వస్తున్నాయి. నేను గత కెప్టెన్లతో పోల్చి మాట్లాడాను. అది నా హక్కు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అభిప్రాయ స్వేచ్ఛ ఉంది," అని సమర్థించుకున్నారు.
వివరాలు
రోహిత్ జట్టులో కూడా ఉండకూడదు
ఈ వివాదం కాంగ్రెస్-బీజేపీ మధ్య రాజకీయ పోరుకు దారితీసింది.
కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.
శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆమె ఆ పోస్టును తొలగించాలని సూచించింది.
ఇక, ఈ వ్యవహారంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ సౌగత రాయ్ తనదైన స్టైల్లో స్పందించారు.
రోహిత్ జట్టులో కూడా ఉండకూడదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ నేత చెప్పింది నిజమే. రోహిత్ జట్టులో చోటు దక్కించుకోకూడదు," అని ఓ ఆంగ్ల మీడియా సంస్థతో వ్యాఖ్యానించారు.