
Bengaluru: ఆర్సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ను విషాదం చోటు చేసుకుంది.
18 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న టైటిల్ను ఎట్టకేలకు సొంతం చేసుకున్న ఆర్సీబీ జట్టును అభినందించేందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు, పరిసర ప్రాంతాల్లోని గోడలు, చెట్లపైకి కూడా ఎక్కారు.
గేట్-2 వద్ద ఒక్కసారిగా స్టేడియంలోకి ప్రవేశించేందుకు జనం ఒక్కసారిగా పరుగులు తీశారు.
అదుపు తప్పిన ఈ పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్రంగా తోపులాట జరగడంతో పరిస్థితి బీభత్సంగా మారింది.
వివరాలు
బెంగళూరు విమానాశ్రయంలో ఘనస్వాగతం..
ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా గాయాలపాలయ్యారు.
గాయపడిన వారిని సమీపంలోని పలు ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఆర్సీబీ టీమ్ తొలి టైటిల్ను గెలుచుకున్న సందర్భంగా,దేశవ్యాప్తంగా జట్టుకు చెందిన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
జట్టు ట్రోఫీతో తొలిసారి బెంగళూరుకు వచ్చిన సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేశారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ కే శివకుమార్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి జట్టుకు స్వాగతం పలికారు.
విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దినేశ్ కార్తిక్ తదితర ఆటగాళ్లకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
వివరాలు
'ఎర్ర సముద్రం'లా విధాన సౌధ
అనంతరం ఆర్సీబీ జట్టు ప్రత్యేక బస్సులో విధాన సౌధకు బయలుదేరింది.
వీరి రాకకు వేలాది అభిమానులు సిద్ధంగా ఉండి, చేతుల్లో ఆర్సీబీ జెండాలతో విధాన సౌధ వద్ద భారీగా గుమిగూడారు.
ఆ ప్రాంతం మొత్తం ఎర్ర జెండాలతో నిండిపోవడంతో 'ఎర్ర సముద్రం'లా మారిపోయింది.
జట్టు బస్సు ప్రయాణించే మార్గంలోనూ అభిమానులు భారీ సంఖ్యలో హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.