
Mohammed Siraj: సిరాజ్ మ్యాజిక్ బాల్కి ధర్మసేన ఫిదా.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో ముగిసిన టెస్ట్ సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆయన, తాజా ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్లో సంచలనం సృష్టించాడు. నేడు విడుదలైన ర్యాంకింగ్స్లో సిరాజ్ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు. 674 రేటింగ్ పాయింట్లతో తన టెస్ట్ కెరీర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ను నమోదు చేసుకోవడం విశేషం. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ 2-2తో సమంగా ముగియడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఓవల్ మైదానంలో జరిగిన చివరి టెస్టులో ఆయన బౌలింగ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చింది.
Details
అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్
మ్యాచ్ చివరి రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరమైన పరిస్థితిలో భారత్కు నాలుగు వికెట్లు కావాల్సి వచ్చింది. ఈ ఉత్కంఠభరిత సమయంలో ప్రసిద్ధ్ కృష్ణతో కలిసి సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. ఇంగ్లండ్ విజయానికి కేవలం ఏడు పరుగులు మిగిలి, చేతిలో ఒకే వికెట్ ఉన్న దశలో బౌలింగ్కు వచ్చిన సిరాజ్, తొలి బంతికే అట్కిన్సన్ ఆఫ్ స్టంప్ను ఎగరగొట్టి భారత్కు ఆరు పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
Details
మెచ్చుకున్న ధర్మసేన
ఆ అద్భుతమైన బంతికి మైదానంలో అంపైర్గా ఉన్న శ్రీలంకకు చెందిన కుమార్ ధర్మసేన సైతం మెచ్చుకున్నారు. "అత్యంత సమీపం నుంచి ఆ బంతిని చూడటం నాకు అదృష్టమంటూ ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి సిరాజ్ను ప్రశంసించారు. ఈ సిరీస్లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పనిభారం కారణంగా కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే ఆడగా, పూర్తి బాధ్యతను తన భుజాలపై వేసుకున్న సిరాజ్, ఐదు మ్యాచ్లన్నింటికీ ఆడిన ఏకైక భారత బౌలర్గా నిలిచాడు. మొత్తం 185 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసి 23 వికెట్లు సాధించి, భారత బౌలర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.