
Ind Vs Eng: మూడో వన్డేలో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి, బౌలింగ్లోనూ చురుకుగా ప్రదర్శించి 13 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 318 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హర్మన్ప్రీత్ కౌర్ 84 బంతుల్లో 102 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. ఆమె ఇన్నింగ్స్లో 14 బౌండరీలున్నాయి.
Details
ఇంగ్లాండ్ పోరాటం.. కానీ ఫలితం లాభించలేదు
ఓపెనర్ స్మృతి మంధాన ధాటిగా ఆరంభించి 54 బంతుల్లో 45 పరుగులు చేసింది. అనంతరం హర్లీన్ డియోల్ (45), జెమీమా రోడ్రిగ్స్ (50) మిడిలార్డర్లో అద్భుతంగా రాణించి స్కోర్ను వేగంగా పెంచారు. వీరి భాగస్వామ్యంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 318/5 చేసింది. జట్టు విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో 319 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు దిగిన ఇంగ్లాండ్.. చివరికి 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్లో నటాలీ స్కివర్-బ్రంట్ ఒక్కడే పోరాడింది. ఆమె 105 బంతుల్లో 98 పరుగులు (11 ఫోర్లు) చేసి శతకం మిస్ అయింది.
Details
సిరీస్ భారత్దే!
ఇంకా ఎమ్మా లాంబ్ మంచి ఇన్నింగ్స్ ఆడి 81 బంతుల్లో 68 పరుగులు చేసింది. అయితే మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలింగ్ లో క్రాంతి గౌడ్ చెలరేగి 6 వికెట్లు తీసి మ్యాచ్ను భారత్ వైపు తిప్పింది. శ్రీ చరణి రెండు, దీప్తి శర్మ ఒక్క వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ను 2-1తో గెలుచుకుంది. మూడో వన్డేలో సమిష్టిగా రాణించిన టీమ్ఇండియా ఈ విజయంతో అభిమానులకు హర్షాన్ని అందించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ మెరుపు ప్రదర్శనతో సిరీస్ను ముద్దాడిన భారత మహిళల జట్టు మరోసారి తన సత్తా చాటింది.