Page Loader
IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ అలర్ట్.. హైదరాబాద్‌ వ్యాపారవేత్తపై బీసీసీఐ అప్రమత్తం

IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ అలర్ట్.. హైదరాబాద్‌ వ్యాపారవేత్తపై బీసీసీఐ అప్రమత్తం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 16, 2025
05:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్ నడుమ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్త ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నాడని గుర్తించి, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని జట్లను అప్రమత్తం చేసింది. బీసీసీఐ యాంటీ-కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ACSU) ఈ వ్యాపారవేత్తపై నిఘా పెట్టి, అతడు ఆటగాళ్లు, జట్ల యజమానులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, కామెంటేటర్లను కూడా టార్గెట్ చేస్తూ అవినీతికి ప్రేరేపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు నిర్ధారించింది.

Details

 బీసీసీఐ హెచ్చరిక

నివేదికల ప్రకారం, ఈ వ్యక్తికి బుకీలు, బెట్టింగ్ సిండికేట్లతో గాఢమైన సంబంధాలు ఉన్నాయి. గతంలోనూ అతడు ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొన్న అనుభవం ఉందని ACSU వెల్లడించింది. అతడు తనను ఒక సాధారణ క్రికెట్ అభిమానిలా చూపించుకుంటూ ఖరీదైన బహుమతులు, ఆభరణాలు, విలాసవంతమైన ఆఫర్ల ద్వారా ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందిని ఆకర్షించేందుకు యత్నిస్తున్నాడు. దీనికితోడు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, జట్టు యజమానులు, విదేశాల్లో ఉన్న బంధువులను కూడా సోషల్ మీడియా ద్వారా టార్గెట్ చేస్తూ సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Details

కఠినమైన చర్యలతో బీసీసీఐ

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్న బీసీసీఐ, అన్ని జట్లకు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. సంబంధిత వ్యక్తితో ఎలాంటి పరిచయం ఉన్నా వెంటనే తమ ఇంటిగ్రిటీ అధికారులకు నివేదించాలని స్పష్టం చేసింది. అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చిన ఏదైనా ప్రలోభం, సంప్రదింపును తక్షణమే ACSUకి తెలియజేయాలని సూచించింది.

Details

వ్యాపారవేత్త వివరాలు గోప్యంగా

ప్రస్తుతం ఈ వ్యాపారవేత్త పేరు బయటపెట్టలేదు. కానీ గతంలో అతడిపై ఉన్న అనేక రికార్డులు ACSU దృష్టికి వచ్చాయని సమాచారం. అతడు ఐపీఎల్ జట్ల హోటళ్లు, మ్యాచ్‌ల సందర్భాల్లో, ప్రైవేట్ ఈవెంట్లలో ప్రత్యక్షమవుతూ ఆటగాళ్లకు సన్నిహితంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ విధంగా ఐపీఎల్‌ పరిధిలోకి ప్రవేశించి, అవినీతి కార్యకలాపాలకు అనుకూల వాతావరణం కల్పించాలని అతడి ప్రయత్నం అని ACSU అనుమానిస్తోంది. బీసీసీఐ 'జీరో టాలరెన్స్' విధానాన్ని అమలు చేస్తోందని స్పష్టం చేస్తూ, క్రికెట్ స్వచ్ఛతను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.