టీమిండియా ఓటమిపై హార్డిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. జట్టు ఆటతీరుపై వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు
వెస్టిండీస్తో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో ఓటమిపాలైన టీమిండియాపై మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్ కేవలం పరిమిత ఓవర్ల టీమ్ గా తయారవుతోందన్నారు. టీ-20 ప్రపంచకప్కి అర్హత సాధించలేని వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయిందన్నారు. ఓటమిపై ఏవో సాకులు చెప్పే బదులు ఆటగాళ్లు ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతకుముందే జట్టు ఓటమిపై టీమిండియా కెప్టెన్ హార్ధిక్ పాండ్యా స్పందించారు. ఓటమి గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్లేయర్స్ ఎలా ఆడారనేది తమకు తెలుసన్నారు. యువ క్రికెటర్లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేశారని కితాబిచ్చారు.