Page Loader
AUS vs IND: సిడ్నీ టెస్టు తుది జట్టులో రోహిత్ స్థానంపై గంభీర్‌ ఏమన్నాడంటే?
సిడ్నీ టెస్టు తుది జట్టులో రోహిత్ స్థానంపై గంభీర్‌ ఏమన్నాడంటే?

AUS vs IND: సిడ్నీ టెస్టు తుది జట్టులో రోహిత్ స్థానంపై గంభీర్‌ ఏమన్నాడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా సిరీస్‌లో ఏదైనా మ్యాచ్‌లో కెప్టెన్ కనీసం ఒక ఇన్నింగ్స్‌లోనైనా తనదైన ఆటను ప్రదర్శిస్తాడు. కానీ 2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రదర్శనతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. అతని ప్రదర్శన చూసి అతడిని తుది జట్టులో కొనసాగించవద్దని డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి సిడ్నీలో ఐదో టెస్టు ప్రారంభం కానుండగా, రోహిత్‌ను తుది జట్టులో కొనసాగిస్తారా లేదా తప్పిస్తారా అనే సందేహాలు తలెత్తాయి.

వివరాలు 

రోహిత్ శర్మతో ఎలాంటి ఇబ్బందులూ లేవు

ఈ ప్రశ్నలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా, మ్యాచ్ సమయానికే తుది జట్టును ప్రకటిస్తామని చెప్పారు. రోహిత్‌తో ఎలాంటి సమస్యలూ లేవని గంభీర్ తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించారు. ''ప్రతిఒక్కరికీ తమ దృష్టిలో ఎక్కడ లోపం జరుగుతోందో తెలుస్తుంది. ఆ లోపాలను సరిదిద్దుకునేందుకు కఠినమైన సాధన చేయాలి. జట్టులో ఏం మాట్లాడుకుంటున్నామనేది బయటకు రాకూడదు. కెప్టెన్ రోహిత్ శర్మతో ఎలాంటి ఇబ్బందులూ లేవు. తుది జట్టు ఎంపిక పిచ్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సిడ్నీ టెస్టు మాకు చాలా కీలకమైంది, అందుకే విజయం సాధించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేస్తున్నారు'' అని గంభీర్ తెలిపారు.

వివరాలు 

రోహిత్ గైర్హాజరీపై.. 

రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు గైర్హాజరైన విషయంపై గంభీర్‌ను ప్రశ్నించగా, ''ఇది సంప్రదాయం అనుకోవడం లేదు. హెడ్ కోచ్‌గా నేను ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చాను, అది సరిపోతుందని భావిస్తున్నాను. బోర్డర్-గావస్కర్ ట్రోఫీని సమం చేయగలమనే నమ్మకం ఉంది. సిడ్నీ టెస్టులో విజయం సాధించేందుకు పటిష్టంగా ప్రయత్నిస్తున్నాం'' అని ఆయన అన్నారు. ఇక తుది జట్టులో మార్పులు జరిగే అవకాశముంది. పంత్, ఆకాశ్‌దీప్ స్థానాల్లో ధ్రువ్ జురెల్ లేదా శుభ్‌మన్ గిల్, ప్రసిధ్ కృష్ణలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వాతావరణ శాఖ ప్రకారం మ్యాచ్‌కు వరుణుడు అప్పుడప్పుడు అంతరాయం కలిగించవచ్చని చెబుతోంది.