Mohammed Shami: 'ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకుంటారు'.. పాక్ మాజీ ప్లేయర్పై షమీ ఫైర్
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏడు మ్యాచులు ఆడి 24 వికెట్లను పడగొట్టాడు. వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఓడిపోయినప్పటికీ షమీ ప్రదర్శనపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. BCCI చీటింగ్ చేస్తోందని, భారత జట్టుకు స్పెషల్ బాల్స్ ఇస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు హసన్ రాజా ఇటీవల కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజా వ్యాఖ్యలను చాలా మంది క్రికెటర్లు ఖండించారు. తాజాగా షమీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజా చేసిన ఆరోపణలను తప్పుబట్టారు.
అద్భుతమైన ప్రదర్శన వెనుక కఠోర శ్రమ ఉంటుంది
షమీ ప్రపంచ కప్ టోర్నీలో మొదట ఐదు వికెట్లు, తర్వాతి మ్యాచుల్లో వరుసగా నాలుగు, ఐదు వికెట్లు తీశానని, అయితే పాక్ ఆటగాళ్లు కొందరు జీర్ణించుకోలేకపోయారని షమీ చెప్పాడు. పాక్ ఆటగాళ్లు వారి మనస్సులో వారు తాము అత్యుత్తమమని అనుకుంటారని, సరైన సమయంలో ప్రదర్శన చేసే ఆటగాళ్లే అత్యుత్తమం అవుతారని పేర్కొన్నాడు. ప్రపంచ కప్లో అద్భుతమైన ప్రదర్శన వెనుక కఠోర శ్రమ ఉంటుందని వెల్లడించాడు. అత్యుత్తమ బౌలర్లు దశలవారిగా తమ స్థాయిని పెంచుకుంటూ వెళ్లారని పాక్ మాజీ ప్లేయర్కు షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.