LOADING...
IND vs PAK: రిఫరీ తొలగింపుపై పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించిన ఐసీసీ
రిఫరీ తొలగింపుపై పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించిన ఐసీసీ

IND vs PAK: రిఫరీ తొలగింపుపై పీసీబీ డిమాండ్‌ను తిరస్కరించిన ఐసీసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 16, 2025
03:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్‌లో ఆదివారం భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ తర్వాత కొత్త వివాదం రేగింది. ఆ మ్యాచ్‌ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌ క్రికెటర్లతో కరచాలనం చేయకపోవడంపై పీసీబీ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనకు కారణం మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ అని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే తొలగించాలని ఆసియా క్రికెట్‌ సంఘానికి ఫిర్యాదు చేసింది. లేనిపక్షంలో టోర్నీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయితే ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడమేనని టీమ్‌ఇండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. 'మ్యాచ్‌ రిఫరీ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు.

Details

సోషల్ మీడియా వేదికగా ప్రకటన

అందుకే పైక్రాఫ్ట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నామని పీసీబీ ఛైర్మన్‌ మోహ్‌సిన్‌ నఖ్వీ సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అంతేకాక టాస్‌ సమయంలో భారత కెప్టెన్‌తో కరచాలనం చేయొద్దని పైక్రాఫ్ట్‌ మా కెప్టెన్‌ సల్మాన్‌ అలీ అఘాకు చెప్పాడని పీసీబీ ముందుగానే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇదే విషయాన్ని పాక్‌ మేనేజర్‌ నవీద్‌ అక్రమ్‌ చీమా కూడా ఏసీసీకి ఫిర్యాదు చేస్తూ, రిఫరీ ఒత్తిడి వల్లే రెండు కెప్టెన్ల మధ్య టీమ్‌ షీట్ల మార్పిడి జరగలేదని ఆరోపించారు.

Details

పీసీబీని పరిగణనలోకి తీసుకొని ఐసీసీ

అయితే పీసీబీ చేసిన ఈ ఫిర్యాదును ఐసీసీ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. రిఫరీపై చర్యలు తీసుకోవడాన్ని నిరాకరించింది. ఈ పరిణామాల నడుమ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా టోర్నీ నుంచి తప్పుకుంటామంటూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల పాకిస్థాన్‌ బుధవారం యూఏఈతో జరగనున్న మ్యాచ్‌లో ప్రణాళిక ప్రకారమే ఆడనుందని సమాచారం. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే పాక్‌ సూపర్‌ 4కు చేరుతుంది. ఇలా జరిగితే సెప్టెంబర్‌ 21న మరోసారి భారత్‌తో పాకిస్థాన్‌ తలపడే అవకాశముంది.