
Ind vs Eng:వన్డే సిరీస్ కి ముందే ఇంగ్లాండ్కు భారీ షాక్.. జేమీ స్మిత్ తొలి రెండు వన్డేలకు దూరమయ్యే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్ టీమ్ టీమిండియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-1తో కోల్పోయింది. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 6 నుండి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను గెలవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. అయితే, తొలి వన్డేకు ముందే ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వికెట్కీపర్ బ్యాట్స్మన్ జామీ స్మిత్ వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని వార్తామాధ్యమాల్లో కథనాలు వెలువడుతున్నాయి. భారతతో జరిగిన టీ20 సిరీస్లో స్మిత్ పాల్గొన్నారు. అయితే, మూడో టీ20లో ఆయన కాలికి గాయమైంది. ఫలితంగా, సిరీస్లో చివరి రెండు టీ20 మ్యాచ్లకు అందుబాటులో లేకపోయారు. అతని స్థానంలో జాకబ్ బెథెల్ ఆడాడు.
వివరాలు
వికెట్ కీపింగ్ బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారో
ఇంగ్లండ్ జట్టు మేనేజ్మెంట్ ప్రకారం, వన్డే సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి స్మిత్ కోలుకుంటాడని భావించారు. కానీ, సిరీస్ ప్రారంభం కావడానికి ముందు రోజు కూడా అతను పూర్తిగా కోలుకోలేదు. అందువల్ల, తొలి రెండు వన్డేలకు అతను దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ జట్టు ఈ విషయంపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్నందున, ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ అతనిపై ఎలాంటి రిస్క్ తీసుకోవద్దనే ఆలోచనలో ఉంది. స్మిత్ అందుబాటులో లేకుంటే, వన్డేల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.
వివరాలు
వన్డేల్లో ఫిల్ సాల్ట్ కి అనుభవం తక్కువ
కెప్టెన్ జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్ ఇద్దరూ వికెట్ కీపింగ్ చేయగలరు. కానీ, గాయం నుంచి కోలుకున్నప్పటి నుంచి బట్లర్ ఈ బాధ్యతలను చేపట్టలేదు. మరోవైపు, ఫిల్ సాల్ట్ మంచి టీ20 వికెట్కీపర్ అయినప్పటికీ వన్డేల్లో అతనికి అనుభవం తక్కువ. భారత్, ఇంగ్లాండ్ జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కావడంతో, ఈ సిరీస్లో అద్భుత ప్రదర్శన ఇచ్చి, మెగా టోర్నీకి పూర్తి సన్నద్ధంగా వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అందువల్ల, ఈ మ్యాచ్లు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు జో రూట్ తిరిగి జట్టులో చేరడం ఇంగ్లాండ్ బలాన్ని మరింత పెంచింది.
వివరాలు
ఇంగ్లాండ్ జట్టు ఇదే..
వన్డే సిరీస్ షెడ్యూల్: తొలి వన్డే: ఫిబ్రవరి 6 - నాగ్పూర్ రెండో వన్డే: ఫిబ్రవరి 9 - కటక్ మూడో వన్డే: ఫిబ్రవరి 12 - అహ్మదాబాద్ భారత కాలమానం ప్రకారం, ఈ మూడు వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, ఫిలిప్ సాల్ట్, జామీ స్మిత్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, లియామ్ లివింగ్స్టోన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.