
WCL 2025: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. దేశమే ముఖ్యమన్న శిఖర్ ధావన్
ఈ వార్తాకథనం ఏంటి
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025) టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన ఉత్కంఠ భరిత మ్యాచ్ రద్దయింది. ఈ పోరును టీమిండియా మాజీ క్రికెటర్లు ఆడేందుకు ముందుకురాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఎడ్జ్బాస్టన్ స్టేడియానికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసినవారికి మొత్తం సొమ్మును తిరిగి చెల్లించనున్నట్టు స్పష్టం చేశారు. ఈ మ్యాచ్ విషయంలో టీమ్ఇండియాలోని కీలక ఆటగాళ్లలో ఒకరైన శిఖర్ ధావన్ తన నిర్ణయాన్ని మే 11నే తెలియజేశాడని వెల్లడించాడు. 'పాకిస్థాన్తో మ్యాచ్ ఆడను' అని ఆ రోజు తన నిర్ణయాన్ని లీగ్ నిర్వాహకులకు మెయిల్ ద్వారా తెలిపానని పేర్కొంటూ..ఆ స్క్రీన్షాట్ను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
Details
దేశం కంటే ఏదీ గొప్ప కాదు
'నా దేశమే నాకు ప్రధానమైంది. దేశం కంటే ఏదీ గొప్పది కాదు. జై హింద్' అంటూ ధావన్ తన స్టాండ్ను మరోసారి స్పష్టం చేశాడు. ఈ లెజెండ్స్ టోర్నీలో టీమ్ఇండియాకు యువరాజ్ సింగ్ నాయకత్వం వహిస్తుండగా, తొలి మ్యాచ్ ప్రత్యర్థి పాకిస్థాన్ కావడం గమనార్హం. అయితే బీసీసీఐ ఇప్పటికే పాక్తో ఎలాంటి క్రికెట్ ఆడకూడదనే వైఖరిని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి అనంతరం బీసీసీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే, తాజా టోర్నీలో భారత్-పాక్ పోరు జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తాయి.
Details
ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చే అవకాశం
'పాకిస్థాన్తో మ్యాచ్కు మాజీ క్రికెటర్లకు అనుమతి ఇచ్చింది ఎవరు?'' అంటూ విమర్శకులు ప్రశ్నలు సంధించారు. ఈ పరిణామాల మధ్య మ్యాచ్ రద్దు కావడం కీలకమైంది. కాగా మ్యాచ్ రద్దయిన తర్వాత ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వనున్నారా? అనే విషయంపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.